Published: 02-12-2018
ఫిర్యాదులొస్తే చర్యలు తథ్యం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైనా, కేంద్ర ఉద్యోగులైనా... అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ, ఏసీబీ చీఫ్ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. ఎవరిపైనైనా తమకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు. అదే సమయంలో... అవినీతి నిరోధంలో సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో సీబీఐకి ‘నో ఎంట్రీ’ బోర్డు చూపిన తర్వాత... శుక్రవారం మొట్టమొదటిసారిగా మచిలీపట్నంలో కేంద్ర ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సూపరింటెండెంట్ రమణేశ్వర్ను ఏసీబీ వల వేసి పట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ తీవ్రంగా స్పందించింది. తాము ఇచ్చిన సమాచారాన్ని రాష్ట్ర హోంశాఖ ఏసీబీకి లీక్ చేసిందని, దీనివల్ల ఒక్క అవినీతి అధికారి మాత్రమే దొరికారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనూరాధ శనివారం వేర్వేరుగా స్పందించారు.
సీబీఐకంటే ముందే బాధితుడు ఏసీబీని ఆశ్రయించారని ఠాకూర్ శనివారం మీడియాకు తెలిపారు. ‘వ్యాపారి లోకేశ్ నుంచి నవంబరు 22న విజయవాడ ఏసీబీ డీఎస్పీ ప్రసాదరావుకు మిస్డ్ కాల్ వచ్చింది. డీఎస్పీ తిరిగి ఫోన్ చేయగా... రమణేశ్వర్ లంచం అడుగుతున్నారని ఫిర్యాదు చేశారు. 26న విజయవాడకు వచ్చి కలవాల్సిందిగా వ్యాపారికి డీఎస్పీ సూచించారు. ఆ వ్యాపారి 27న విజయవాడ ఏసీబీ కార్యాలయానికి వచ్చి రమణేశ్వర్తో తనకు నడిచిన సంభాషణ కాల్ రికార్డు అందించారు. ఆ రోజు మండవల్లిలో రాష్ట్ర ప్రభుత్వ అవినీతి అధికారిని ట్రాప్ చేసే పనిలో ఉన్న ప్రసాదరావు... ఆ మరుసటి రోజు ఫిర్యాదు తీసుకుంటానని చెప్పి పంపారు. ఈ విషయాన్ని ఏసీబీ ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులకు తెలియజేశారు.
నవంబరు 28న ఆ వ్యాపారి సీబీఐకి కూడా ఫోను చేశారు. అదే రోజున ఏసీబీ సీఐయూ అడిషనల్ ఎస్పీ రమాదేవి లోకేశ్కు కాల్ చేశారు. అప్పటికే ఆయన ముందు సీబీఐ అధికారులున్నారు. వారు అప్పటికప్పుడు హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనూరాధను కలిసి అనుమతి కోరారు. ఏసీబీకి సమాచారం అందించిన వారం తర్వాతే సీబీఐకి బాధిత వ్యాపారి ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని ఆయన సీబీఐ అధికారులకు కూడా చెప్పారు’ అని డీజీపీ వివరించారు. దీనికి సంబంధించిన ఫోన్కాల్ రికార్డు కూడా ఉందన్నారు. దానిని సీబీఐ అధికారులు పరిశీలించుకోవచ్చునని తెలిపారు.
అవినీతిని అంతమొందించడమే సీబీఐ, ఏసీబీ ఉమ్మడి లక్ష్యమని... ఇద్దరం పరస్పరం సహకరించుకుంటామని ఆర్పీ ఠాకూర్ పేర్కొన్నారు. సీబీఐ తమపై ఆరోపణలు చేసినప్పటికీ వారిని నిందించబోమని తెలిపారు. ఏసీబీ పనితీరును సీబీఐ కూడా అభినందించాలన్నారు. ఈడీ, ఇన్కంటాక్స్, ఇతర ఏ సంస్థలకైనా సహకరించేందుకు ఏసీబీ సిద్ధంగా ఉందని తెలిపారు. ుూమాకు ఏపీలోని 13 జిల్లాల్లో సిబ్బంది ఉన్నారు. సీబీఐకి కేవలం విశాఖలో మాత్రమే ఉన్నారు. అలాంటప్పుడు ఎవరు సమర్థంగా పని చేయగలరు?్్ అని ప్రశ్నించారు.
