Published: 27-11-2018
ఈసారి పవన్కు అధికారమిద్దాం

చంద్రబాబుకు సెలవిద్దాం.. జగన్ను పక్కనపెడదాం.. ఈసారి పవన్ కల్యాణ్కు అధికారం ఇవ్వండి’ అని జనసేన అధ్యక్షుడు పవన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని త్రిరోడ్ జంక్షన్లో సోమవారం రాత్రి జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. జగన్, సీఎం చంద్రబాబులపై తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవన్నారు. ‘ప్రతిపక్ష నేత హోదాలో చట్టసభకు వెళ్లి.. చంద్రబాబు తనయుడు లోకేశ్ చేస్తున్న అవినీతి అక్రమాలపై మాట్లాడలేని జగన్ నా వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం తగదు.
మీ అందరికంటే నా వ్యక్తిగత జీవితం చాలా బెటర్. మీ గురించి మాట్లాడటం వస్తే దారుణమైన వాస్తవాలు బయటపెట్టాల్సి ఉంటుంది. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల నా జీవితం అలా రోడ్డున పడింది’ అని వ్యాఖ్యానించారు. ‘నేనే కనుక ప్రతిపక్ష నేత హోదాలో ఉండి.. నా ఎమ్మెల్యేలను చంద్రబాబు కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే.. నేనొక్కడినే అసెంబ్లీకి వెళ్లి ఎదురొడ్డి పోరాడేవాడిని’ అని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ బ్రహ్మచారో కాదో మనకు తెలియని విషయమని చెప్పారు.
.
‘మా తాత ముఖ్యమంత్రి, మా నాన్న ముఖ్యమంత్రి, నేను కూడా ముఖ్యమంత్రి కావాలనుకోవడం పదవీవ్యామోహానికి అద్దం పడుతోంది. సీఎం పదవి బాధ్యతతో కూడుకున్నది. చంద్రబాబు, మంత్రి లోకేశ్లా సూట్కేసులు ఇస్తే తీసుకోవడం.. వేలకోట్లు వెనకేసుకుని అవినీతి అంశాలను గాలికొదిలేసే జగన్లా వెనక్కి తగ్గేవాడిని కాదు. కోనసీమలో పుట్టకపోయినా ఆ పౌరుషం నాలో ఉంది. పంచాయతీ ప్రెసిడెంట్ కూడా కాలేని లోకేశ్ పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన పేరిట లంకల గన్నవరంలో ఒక ప్రత్యేక ర్యాంపే ఉంది, అడ్డగోలుగా ఇసుకను దోచుకుంటున్నారు. మట్టి, ఇసుక దోపిడీల్లో టీడీపీ, వైసీపీ ఒక్కటే. పంచభూతాలను సైతం దోచుకునే చరిత్ర లోకేశ్దే’ అని విమర్శించారు.
‘నాకు వేల కోట్లు లేవు, పారిశ్రామికవేత్తలు అసలు లేరు, చంద్రబాబు, లోకేశ్లకు మాదిరిగా పరిశ్రమలు లేవు, జగన్లా వేలకోట్ల ఆస్తులు లేవు, ప్రజలే నా బలం.. సంపద.. పెట్టుబడి. వచ్చే 30 ఏళ్లలో ప్రజలకు బంగారు భవిష్యత్ ఇవ్వాలనే లక్ష్యంతో జనసేనను స్థాపించాను’ అని చెప్పారు. చమురు, సహజవాయువు ద్వారా వచ్చే వేల కోట్ల ఆదాయాన్ని రిలయన్స్, ఓఎన్జీసీ, గెయిల్ వంటి సంస్థలు దోచుకుపోయి కోనసీమకు ఎనలేని నష్టాన్ని కలిగిస్తున్నాయని పవన్ అన్నారు. రిలయన్స్ సంస్థ అధినేత అంబానీకి సైతం ఎదురొడ్డి పోరాడగలిగే శక్తి పవన్ ఒక్కడికే ఉందన్నారు.
