జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం

రాజమండ్రి: అవినీతిని పారద్రోలి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని జనసేన అధినేత పవన్కల్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా రాజానగరంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ బోఫోర్సు లాంటి కుంభకోణాలు, ప్రస్తుతం నియోజకవర్గం స్థాయిలోనే జరుగుతున్నాయని ఆరోపించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రారంభించిన టీడీపీని, సీఎం చంద్రబాబు కాంగ్రెస్ నేతల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని పవన్ ధ్వజమెత్తారు. టీడీపీ నేతలకు పౌరుషం లేదని ఎద్దేవాచేశారు. జనసేన లేకుండా చంద్రబాబు సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు. జగన్కు దమ్ముంటే అసెంబ్లీలో ప్రజాసమస్యలపై నిలదీయాలని డిమాండ్ చేశారు. అవినీతి రాజకీయ నాయకులను తన్ని తరిమేద్దామని ఆయన పిలుపునిచ్చారు. విద్యాసంస్థలను మంత్రి నారాయణకు ఇచ్చేస్తారని, మద్యం షాపులను మాత్రం చంద్రబాబు, జగన్, లోకేష్ నడుపుతారని దుయ్యబట్టారు. బైబిల్ పట్టుకుని తిరిగే జగన్... మద్య నిషేధంపై ఎందుకు మాట్లాడరని పవన్కల్యాణ్ నిలదీశారు.
