Published: 14-11-2018
వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జి కుమార్రాజు అరెస్టు

గుంటూరు: సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో మరోసారి అభ్యంతరకర పోస్టింగ్స్ హల్చల్ చేశాయి. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే కార్యక్రమంలో భాగంగా ఈనెల 8న సీఎం చంద్రబాబు బెంగళూరు వెళ్ళారు. ఈసందర్భంగా బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో పార్టీ నేతలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఆ సందర్భంగా వారు సింబర్ ఆఫ్ యూనిటి, యు ఆర్ది హోప్ వుయ్ రెలి ఆన్ .. అనే ఇంగ్లీషు కొటేషన్లతో ప్లకార్డులు ప్రదర్శించారు. ఆయా ఫొటోలను వారు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేశారు. అయితే కొందరు ఈ ఫొటోల్లోని ఇంగ్లీషు కొటేషన్స్ను మార్ఫింగ్ చేశారు. సింబల్ ఆఫ్ యూనిటిని.. సింబల్ ఆఫ్ షేమ్గా మార్చారు.
యు ఆర్ ది హోప్ వుయ్ రెలి ఆన్ అనే పదాన్ని వుయ్ ఫీల్ అషేమ్డ్గా మార్చారు. అంతేకాక బెంగళూరు తెలుగుదేశం ఫోరం నుంచి ‘చంద్రబాబుకు ఘోర అవమానం’ అంటూ మార్ఫింగ్ చేసిన ఆయా ఇంగ్లీషు కొటేషన్ల ప్లకార్డులతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టింగ్ చేశారు. అయితే వీటిని చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన కుమార్రాజు నవీన్కుమార్ రాజు అనే యువకుడు పలువురి ఫేస్బుక్ అకౌంట్స్కు, వివిధ గ్రూపులకు పంపాడు. దీనిపై టీడీపీ రాష్ట్ర సోషల్ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి కనకమేడల వీరాంజనేయులు ఈనెల 10న అరండల్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 468, 469, 471, 505, 120బితో పాటు ఐటీ యాక్టు 2000 - 2008లోని సెక్షన్ 65, 66 (బి) ప్రకారం కేసు నమోదు చేశారు.
అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో కుమార్రాజును నిందితుడిగా గుర్తించి మంగళవారం అరెస్టు చేశారు. కుమార్రాజు కడపజిల్లా రాజంపేట పార్లమెంటు వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మంగళవారం అరండల్పేట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీలు వైటీ నాయుడు, బి.లక్ష్మినారాయణ, వెస్ట్ డీఎస్పీ సౌమ్యలత, అరండల్పేట సీఐ వై.శ్రీనివాసరావు తదితరులు నిందితుడు కుమార్రాజును మీడియా ఎదుట హాజరుపర్చి వివరాలు వెల్లడించారు.
ఈ కేసులో ఆయా పోస్టింగ్స్ను మార్ఫింగ్స్ చేసిన వారిని గుర్తించాల్సి ఉందని అదనపు ఎస్పీ వైటీ నాయుడు తెలిపారు. కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. త్వరలోనే మిగిలిన నిందితులను అరెస్టు చేస్తామన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్స్ పెట్టే వారిపై రాజకీయాలకతీతంగా చర్యలు తీసుకుంటామని వైటీ నాయుడు స్పష్టం చేశారు.
