Published: 23-10-2018

సీబీఐ యుద్ధంలోకి సీఎం రమేశ్‌

రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐని ప్రయోగించడం... అవసరమైతే తప్పుడు వాంగ్మూలాలు సృష్టించైనా ఇరికించడం... అస్మదీయులను కాపాడటం! కేంద్ర సర్కారుపై ఉన్న ఈ ఆరోపణలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి! కేంద్రంపై యుద్ధానికి దిగిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ను ఇరికించేందుకు కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ కుమార్‌ వర్మ, స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానా మధ్య మొదలైన కుమ్ములాటల్లో ఈ సంగతి బయటపడింది. అలోక్‌ వర్మకు ‘ముడుపుల మకిలి’ పట్టించి... సీఎం రమేశ్‌ ద్వారానే ఈ లావాదేవీలు జరిగాయనేందుకు తగిన ‘ఆధారాలు’ సృష్టించినట్లు వెల్లడైంది. ఇప్పుడు ఈ కేసులో సీబీఐ తన సొంత డీఎస్పీని అరెస్టు చేయడం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
 
వేల కోట్లను మనీలాండరింగ్‌ చేసే మాంసం వ్యాపారి మొయిన్‌ ఖురేషీ కేసు నుంచి బయట పడేందుకు ఏపీకి చెందిన సానా సతీశ్‌ బాబు ఏకంగా సీబీఐ డైరెక్టర్‌కే ముడుపులు చెల్లించారన్నట్లుగా రాకేశ్‌ అస్థానా బృందం ఆధారాలు సృష్టించింది. ‘‘నా కేసు గురించి ఈ ఏడాది జూన్‌లో నా పాత మిత్రుడు సీఎం రమేశ్‌తో చర్చించాను. దీనిపై సీబీఐ డైరెక్టర్‌తో మాట్లాడతానని ఆయన భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ సీఎం రమేశ్‌ను కలిసినప్పుడు... సీబీఐ డైరెక్టర్‌ను స్వయంగా కలిశానని చెప్పారు. ఇక సీబీఐ నన్ను పిలవబోదని కూడా తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే జూన్‌ నుంచి ఇప్పటిదాకా నాకు సీబీఐ నుంచి సమన్లు రాలేదు.
 
దీంతో నాపై కేసు క్లోజ్‌ అయినట్లుగా భావించాను’’ అని సానా సతీశ్‌ గతనెల 26న వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలిపింది. సీబీఐ డీఎస్పీ దేవేంద్ర కుమార్‌ ఈ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దీనిని ‘అస్త్రం’గా వాడుకుని... అటు సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మను, ఇటు సీఎం రమేశ్‌ను అడ్డంగా ఇరికించడమే అస్థానా బృందం అసలు ఉద్దేశం కావొచ్చు! ఈ విషయంలో తన పేరును లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియడంతో అలోక్‌ వర్మ అప్రమత్తమై రంగంలోకి దిగారు. వాంగ్మూలం ఇచ్చినట్లు చెబుతున్న గతనెల 26న సానా సతీశ్‌బాబు ఢిల్లీలోనే లేరని నిర్ధారించారు.