Published: 24-09-2018
సీఎం అయినా.. కాకున్నా ప్రజా సమస్యలపై పోరాడతా

మనస్సాక్షికి సమాధానం చెప్పుకోడానికే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. ఆదివారం నెల్లూరులో రొట్టెలపండుగలో పాల్గొన్న ఆయన నగరంలోని ఓ హోటల్లో పార్టీ కార్యకర్తలతో సమావేశమై ప్రసంగించారు. ‘‘నాకు ఇన్ని కోట్ల మంది అభిమానులుండి, జరుగుతున్న తప్పుల గురించి మాట్లాడగలిగే శక్తి ఉండి, నేను మాట్లాడలేకపోతే సమాజానికి చేటు చేసినవాడినే అవుతా. నా మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. సీఎం అవుతానో లేదో అది ఇప్పుడే చెప్పలేను. ఆ విషయం గురించి నేను ఆలోచించలేదు. సినిమాల్లోకి వచ్చినప్పుడు ఇన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంటానని అనుకోలేదు. కేవలం మంచి సినిమాలు చేయాలనే వచ్చాను. ఇప్పుడు రాజకీయాల్లో కూడా అంతే. ప్రజలకు మంచి చేయాలనే వచ్చాను. సీఎం స్థానంలో లేకున్నా సమస్యలపై పోరాడే శక్తి ఉంది. ఆ శక్తిని సమాజానికి ఉపయోగించాలనే రాజకీయాల్లోకి వచ్చాను’’ అని స్పష్టం చేశారు. చిన్నతనంలో దేశభక్తి గీతాలు విన్నప్పుడు దేశానికి ఏదో చేయాలని ఉద్వేగపడేవాడినని, కానీ ఏమి చేయాలో తెలిసేది కాదన్నారు.
ఇప్పుడు జనసేన ద్వారా ప్రజల కోసం పోరాటాలు చేస్తానని, ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం శ్రమిస్తానని చెప్పారు. ఎంతో కష్టపడి ఉన్నతస్థాయికి ఎదిగి ఏడాదికి రూ.25కోట్లు పన్ను చెల్లించే తాను అన్నీ వదులుకుని పార్టీ నిర్మా ణం చేశానని తెలిపారు. అధికారం వచ్చినా, రాకపోయినా పోరాటయోధుడిగా ప్రజల కోసమే పోరాటాలు చేస్తానన్నారు. పార్టీ జెండా మోసి, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినంత మాత్రాన ఎవరూ నాయకులు కాలేరుని, ప్రజలకు సేవ చేయాలన్న ఆశయం ఉన్నవారే నాయకులవుతారని పవన్ అన్నారు. జనసేనలోకి పవన్కల్యాణ్ను చూసి రావడం కంటే పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవచేయాలన్న లక్ష్యంతో రావాలన్నారు.
కేవలం నినాదాలు, కేకలతో పార్టీ మనుగడ ఉండదని, ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని ఓటుతో సమాధానం చెప్పాలన్నారు. విలువలతో కూడిన సమాజం ఏర్పడాలంటే విద్యావ్యవస్థలో మార్పులు రావాలని పవన్ ఆకాంక్షించారు. అలాంటి మార్పు రావాలంటే ఉపాధ్యాయులకు ఆర్థిక భరోసా కల్పించాలన్నారు. ఉపాధ్యాయులు ఆర్థికంగా స్థిమితంగా ఉంటేనే మంచి బోధన చేయగలరన్నారు. ఈ రోజు తాను ఈ స్థితిలో ఉండటానికి తన గురువులే కారణమన్నారు. అనంతరం తన చిన్ననాటి గురువులను సత్కరించి, పాదాభివందనం చేశారు.
