Published: 19-09-2018
ఉద్యోగ మేళా

అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ ఉద్యోగ నియామక ప్రక్రియకు తెర లేపింది. ఓ వైపు నిరుద్యోగ భృతి చెల్లించడానికి సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం... మరోవైపు 20,010 ఉద్యోగాలను ప్రత్యక్ష పద్ధతిలో భర్తీ చేస్తామంటూ శుభవార్త చెప్పింది. గ్రూప్స్, డీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వీటిని భర్తీ చేయడానికి సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారు. మంగళవారం ఉదయం అసెంబ్లీలోని తన చాంబర్లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వివిధ శాఖల్లో ప్రస్తుతం ఉన్న ఖాళీలు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మెగా రిక్రూట్మెంట్లకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పోస్టుల సమగ్ర వివరాలు
- జిల్లా ఎంపిక కమిటీలు(డీఎస్సీ) ద్వారా మొత్తం 9,275 టీచర్ పోస్టులు భర్తీ చేస్తారు. ఇందులో జిల్లా పరిషత్, మండల ప్రజాపరిషత్ పాఠశాలల్లో 5 వేలు, మున్సిపల్ పాఠశాలల్లో 1100, గురుకుల పాఠశాలల్లో 1100, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 750, షెడ్యూల్ ఏరియాలోని ఆశ్రమ పాఠశాలల్లో 500, నాన్ షెడ్యూల్ ఏరియాలోని ఆశ్రమ పాఠశాలల్లో 300, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 350, ఏపీఆర్ఈఐ సొసైటీ అధీనంలోని పాఠశాలల్లో 175 ఖాళీలు ఉన్నాయి.
- ఏపీపీఎస్సీ ద్వారా 150 గ్రూప్-1 ఖాళీలు, 250 గ్రూప్-2 పోస్టులు, 1670 గ్రూప్-3 ఖాళీలను భర్తీ చేస్తారు. అలాగే 310 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు, 200 జూనియర్ లెక్చరర్ (ఇంటర్మీడియెట్) పోస్టులు, 10 ఏపీఆర్ఈఐ సొసైటీ పోస్టులు, 5 ఏపీఆర్ఈఐ సొసైటీ డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులు, 200 డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. మరో 1,636 ఇతర ఖాళీలను కూడా భర్తీచేయనున్నారు.
- సమాచార, పౌరసంబంధాల శాఖలో 21 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో 4 డీపీఆర్వో పోస్టులు, 12 ఏపీఆర్వో పోస్టులు, 5 డీఈటీఈ పోస్టులు ఉన్నాయి. వీటిని కూడా ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేసే అవకాశం ఉంది.
- వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా... వైద్యశాఖలోని 1604 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- పోలీస్ రిక్రూట్మెంట్బోర్డు ద్వారా 3వేల పోలీస్ ఎగ్జిక్యూటివ్, ఏపీఎ్సఎల్పీఆర్బీ ఖాళీల భర్తీ.
రాష్ట్ర విభజన తర్వాత రెండోసారి
రాష్ట్ర విభజన తర్వాత 2014 జూన్ 8న చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రెండోసారి నియామకాలు చేపట్టబోతున్నారు. తొలుత డీఎస్సీ-2014 పేరిట దాదాపు 9 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు.
10వేల పోస్టుల భర్తీ కోసం ఆర్థికశాఖ 2016 జూన్ 17న జీ.వో.నం.110 జారీచేసింది. ఏపీపీఎస్సీ ద్వారా 4009 పోస్టులను, ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 5,991 పోస్టులను భర్తీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీపీఎస్సీ ద్వారా 4009 పోస్టులను భర్తీచేయాలని ఉత్తర్వులిచ్చినప్పటికీ, క్యారీ ఫార్వర్డ్ ఖాళీలతో కలిపి 34 నోటిఫికేషన్ల ద్వారా 4,500 పోస్టులను భర్తీచేశారు.
అక్టోబరులో తొలి నోటిఫికేషన్: ఏపీపీఎస్సీ
వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి వీలుగా ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేయగానే తమ ప్రక్రియను ప్రారంభిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ పిన్నమనేని ఉదయభాస్కర్ తెలిపారు. అక్టోబరు నెలాఖరులో ఏపీపీఎస్సీ నుంచి తొలి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన చెప్పారు. డిసెంబరులోగా అన్ని రకాల నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు.
గ్రూప్స్ సిలబ్సలో స్వల్ప మార్పులు
ఏపీపీఎస్సీ చేపట్టే వివిధ సర్వీసుల రిక్రూట్మెంట్లకు సంబంధించి సిలబ్సలో స్వల్ప మార్పులు తీసుకొస్తున్నామని చైౖర్మన్ చెప్పారు. రాష్ట్రస్థాయిలో అత్యంత ప్రధానమైన గ్రూప్-1 సర్వీసుకి సంబంధించిన ముసాయిదా సిలబ్సను ఏపీపీఎస్సీ తన వెబ్సైట్లో ప్రదర్శించింది. నిపుణుల కమిటీ రూపొందించిన ప్రిలిమ్స్, మెయిన్స్ ముసాయిదా సిలబ్సలను అందుబాటులో ఉంచింది. వీటిపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరింది. దీంతో... సిలబస్ చాలా క్లిష్టంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలా వచ్చిన సలహాలు, సూచనలను మరో నిపుణుల కమిటీకి నివేదించారు. మరో వారంలో తుది సిలబ్సను ఏపీపీఎస్సీ ఖరారు చేయనుంది.
గ్రూప్-1 ప్రిలిమ్స్లో 2 పేపర్లు
గ్రూప్-1 ప్రిలిమ్స్లో ప్రస్తుతం ఒకే పేపర్ను 150 మార్కులకు నిర్వహిస్తుండగా ... ఇకపై రెండు పేపర్లను 120 మార్కుల చొప్పున నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్లు కూడా ఆబ్జెక్టివ్ టైపులోనే ఉంటాయి. ఇందులో ఒకటి జనరల్ స్టడీస్ పేపర్ కాగా, రెండోది జనరల్ ఆప్టిట్యూడ్ పేపర్. కొత్తగా నిర్వహించతలపెట్టిన జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో... జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, సైకలాజికల్ ఎబిలిటీ, అంతర్జాతీయ సంబంధాలు, సామాజిక న్యాయం, రాజనీతి శాస్త్రం, జాతీయ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ప్రణాళిక అమలు, జాగ్రఫీపై ప్రశ్నలు ఇస్తారు. ప్రిలిమ్స్ నుంచి 1:12 నుంచి 1:15 నిష్పత్తిలో సామాజిక వర్గాల సమతుల్యతను అనుసరిస్తూ అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేస్తారు. తొలిసారిగా ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కుల విధానాన్ని అమలు చేయతలపెట్టింది.
- గ్రూప్-1 మెయిన్స్లో ఇంగ్లిష్ పేపర్ (తప్పనిసరిగా అర్హత సాధించాలి), మరో ఐదు డిస్ర్కిప్టివ్ టైపు పరీక్షలను నిర్వహిస్తుండగా... ఇకపై వీటికి అదనంగా తెలుగు పేపర్ (తప్పనిసరిగా అర్హత సాధించాలి) పరీక్ష కూడా నిర్వహిస్తారు. అంటే మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ను 150 మార్కులకు నిర్వహిస్తారు. కొత్తగా నిర్వహించే తెలుగు పేపర్లో తెలుగును ఇంగ్లి్షలోకి అనువదించడం, వర్తమాన అంశాలపై ప్రశ్నలు, ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ, లెటర్ రైటింగ్, వ్యాసాలు, తెలుగు వ్యాకరణం వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్, తెలుగు... ఈ రెండింటిలోనూ అర్హత సాధించని అభ్యర్థుల పనితీరును పరిగణనలోనికి తీసుకోరు. మిగిలిన 5 డిస్ర్కిప్టివ్ టైపు పేపర్లలో సిలబ్సను మార్చారు.
- గ్రూప్-1 స్ర్కీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన అభ్యర్థుల నుంచి ప్రతి కేటగిరీలో వేర్వేరుగా కటాఫ్ నిర్ణయించి 1:12/1:15 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ రాసేందుకు అర్హత కల్పిస్తారు.
గ్రూప్-2లో కామన్ సిలబస్
గ్రూప్-2 సర్వీసెస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఏపీపీఎస్సీ స్ర్కీనింగ్ టెస్ట్, మెయిన్స్ అంటూ ఈ రెండు పరీక్షలు నిర్వహిస్తోంది. గత నోటిఫికేషన్ ప్రకారం స్ర్కీనింగ్ టెస్ట్కు, మెయిన్స్కు వేర్వేరుగా సిలబస్ పెట్టారు. అయితే దీనివల్ల ప్రిపరేషన్కు సమయం చాలడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిరుద్యోగుల మనోభావాలను దృష్టిలో పెట్టుకున్న ఏపీపీఎస్సీ ఇప్పటికే గ్రూప్-3 సర్వీసె్సతో పాటు పలు ఇతర సర్వీసులకు కూడా స్ర్కీనింగ్ టెస్ట్తో పాటు మెయిన్స్కూ కామన్ సిలబ్సను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు గ్రూప్-2 సర్వీసె్సలోనూ స్ర్కీనింగ్ టెస్ట్కు, మెయిన్స్కు కామన్గా సిలబస్ ఉండేలా కసరత్తు చేస్తోంది. గ్రూప్-2 సర్వీసె్సకు సంబంధించినంత వరకూ పరీక్ష ప్యాట్రన్లో ఎలాంటి మార్పులూ చేయరాదని నిర్ణయించింది.
గ్రూప్-3 సిలబ్సలో మార్పులు
గ్రూప్-3 సర్వీసెస్ సిలబ్సలో స్వల్ప మార్పులు ఉంటాయని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఏఈ, ఏఈఈ, ఏఎంవీఐ తదితర ఇంజనీరింగ్ పోస్టులకు ఈ సారి కామన్ సిలబ్సను ఏపీపీఎస్సీ తయారు చేస్తోంది. ఇప్పటివరకూ... పోస్టు ఒక్కటే అయినప్పటికీ అర్హతలను బట్టి ప్రశ్నపత్రాలను వేర్వేరు సిలబ్సలలో ఇచ్చేవారు.
డీఎస్సీ-2018లో 961 పోస్టులకు కోత
డీఎస్సీ-2018లో 10,351 పోస్టుల భర్తీకి వీలుగా పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించింది. ఇందులో క్లియర్ వేకెన్సీలు (ఉన్న పోస్టులు) 7,061 కాగా, మిగిలిన 3,290 కన్వర్షన్ (ఎస్జీటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా మార్పిడి) పోస్టులు. క్లియర్ వేకెన్సీ(7061)ల్లో 5,614 పోస్టులు విద్యాశాఖకు చెందినవి కాగా మిగిలిన 1447 మున్సిపల్ పాఠశాలల పోస్టులు. అయితే మంగళవారం ప్రభుత్వం 6100 పోస్టులను భర్తీ చేసేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అంటే 7061 పోస్టుల (ఉన్న పోస్టులు)ను ప్రతిపాదించగా వాటిల్లో 961 పోస్టులను తగ్గించినట్లయింది.
