Published: 10-09-2018
రాజధానికి ముప్పు తొలగింది

రాజధాని నగరానికి కొండవీటివాగు నుంచి వరద ముంపు ముప్పు తొలగిపోయింది. అలాగే పెరిగే జనాభాకు తాగునీటి అవసరాలకూ ఎలాంటి ఇబ్బందీ రాదు. రాజధాని నిర్మాణం ప్రారంభంలోనే భవిష్యత్ అవసరాలూ, ప్రమాదాలను గుర్తించి చేపట్టిన కొండవీటివాగు ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయింది. సీతానగరం కృష్ణానది కరకట్ట వద్ద రూ.222.44 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ పథకం ట్రయల్ రన్ ఆదివారం విజయవంతమైంది. పట్టిసీమ, ముచ్చుమర్రి, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలను చేపట్టి సకాలంలో పూర్తిచేసిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా కంపెనీయే కొండవీటివాగు పథకాన్నీ లక్ష్యం మేరకు పూర్తిచేసింది.
ఈ పథకాన్ని ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ట్రయల్ రన్లో భాగంగా శని, ఆదివారాల్లో ఉండవల్లి రెగ్యులేటరీ గేట్లు తెరచి నదిలో నుంచి వాగులోకి బ్యాక్వాటర్ను విజయవంతంగా పంప్చేశారు. మోటార్లన్నీ విజయవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ ఎస్ఈ బాబూరావు, మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్టు మేనేజరు జగన్ తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది మార్చిలో కొండవీటివాగు పథకం బాధ్యతను చేపట్టిన మేఘా సంస్థ.. అనేక సవాళ్లను అధిగమించి దీనిని పూర్తిచేసింది. ఉబికివస్తున్న నీటి ఊటతో కాంక్రీటు పనులకు నిత్యం ఆటంకాలు ఎదురయ్యాయి. మూడువైపులా నీటి నిల్వలు.. కాలువలు ఉండడంతో సమస్య తీవ్రత ఎక్కువగా ఉండేది. వర్షాలు పడినప్పుడు, ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని విడిచిపెట్టినప్పుడు, బకింగ్హాం కెనాల్ నీటిని ఎక్కువగా వదిలినప్పుడూ ఈ ఊట సమస్య మరీ తీవ్రంగా ఉండేది.
ఈ సమస్యను అధిగమించేందుకు రోజంతా 25 జనరేటర్లతో.. నిర్మాణ ప్రాంతానికి వచ్చి చేరిన నీటిని తోడుతూ పనులు సాగించారు. ఈ నీటిని తోడేందుకే రూ.5 కోట్ల దాకా వ్యయమైంది. తామెదుర్కొన్న ప్రధాన సమస్య నీటిని తోడే పనేనని ప్రాజెక్టు మేనేజరు జగన్ చెప్పారు. వరద నీరు వచ్చి చేరుతూ కాంక్రీటు పనులు చేపట్టేందుకు ఆటంకాలు ఏర్పడుతుంటే.. మరోవైపు కరకట్ట చుట్టూ ఉన్న ఆక్రమణలతో మరో సమస్య వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం చొరవ చూపి పరిష్కరించడంతో నిర్వాసితుల నుంచి ఇబ్బందులు ఎదురుకాలేదన్నారు.
నిర్మాణం ఇలా..
ఎత్తిపోతల నిర్మాణంలో భాగంగా ఫోర్బే (వాగు వరదనీటి కలెక్షన్ పాయింట్), మోటారు పంప్హౌస్, డెలివరీ సిస్టమ్(డిశ్చార్జి పాయింట్), ఎస్కేప్ రెగ్యులేటర్, సబ్స్టేషన్, ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణ పనులను మేఘా చేపట్టింది. ఫోర్బేలోకి వచ్చిన వరదనీటిని పంపులతో డెలివరీ సిస్టమ్ సాయంతో నదిలోకి ఎత్తిపోస్తారు. 16 పంపులు, 16 మోటార్లు ఏర్పాటు చేశారు. ఒక్కో పంపు నుంచి 350 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. మొత్తంగా 15 పంపులే పనిచేస్తాయి. ఒక పంపు స్టాండ్బైగా ఉంటుంది. ఏదైనా మరమ్మతుకు వచ్చినప్పుడు ఈ పంపును ఉపయోగిస్తారు. ప్రతి పంపు పనిచేయడానికి 1.6 కిలోవాట్ల విద్యుత్ వినియోగించాలి. కృష్ణా నదికి ఎంత భారీ వరద వచ్చినా గరిష్ఠంగా 18.4 అడుగులకు మించదు. అయినా ముందుచూపుతో 22 అడుగుల ఎత్తులో డిశ్చార్జి పాయింట్ను నిర్మించారు. ఈ పాయింట్ నుంచి పంప్హౌస్ మధ్య 16 వరుసల పైపులైన్ను ఏర్పాటు చేశారు.
ఈ పైపులైన్ పొడవు 1.4 కిలోమీటర్లు. యుద్ధ ప్రాతిపదికన దీనిని పూర్తిచేసి.. విజయవాడ నుంచి ఉండవల్లి సీఎం అధికారిక నివాసం, తాత్కాలిక సచివాలయం వరకూ వెళ్లే రహదారిని పునరుద్ధరించారు. డిశ్చార్జి పాయింట్, కరకట్ట, పంప్ హౌస్ మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని అందమైన పార్కుగా తీర్చిదిద్దారు. డిశ్చార్జి పాయింట్ నుంచి కృష్ణా నది అందాలను సందర్శకులు సందర్శించేందుకు ఏర్పాట్లూ చేశారు. ఎత్తిపోతల పథకం నిర్వహణకు ప్రధానమైన విద్యుత్ లైన్లు, 132/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణం కూడా పూర్తయింది. 1,250 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన రెండు డీజిల్ జనరేటర్లనూ ఏర్పాటు చేశారు. 5 లాకులతో (గేట్లు) ఎస్కేప్ రెగ్యులేటర్ నిర్మాణం కూడా పూర్తయింది. ఒక్కో గేటు పొడవు 2.65 మీటర్లు. వెడల్పు కూడా అంతే. కొండవీటివాగు వరద తీవ్రత ఎక్కువైతే ఈ లాకులను ఎత్తివేసి సహజ ప్రవాహంతో వరదనీటిని బకింగ్హాం కెనాల్లోకి మళ్లిస్తారు. ఎత్తిపోతల తొలిదశ పనులు విజయవంతంగా పూర్తయిన నేపఽథ్యంలో రెండోదశ కింద వాగు విస్తరణ పనులను మొదలెట్టబోతున్నారు.
