పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది...

అనంతపురం జిల్లాలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అన్నారు. బుధవారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ఆలూరులో ఎస్ఐపై ఓ వ్యక్తి వాగ్వాదానికి దిగడంతో పాటు చేయిచేసుకున్న వైనాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘పిక్ పాకెటర్నో.. మట్కారాయుళ్లనో.. రౌడీషీటర్లనో స్టేషన్లకు పిలిపించి గౌరవంగా వారిని కుర్చీలో కూర్చోబెట్టి ఓ కప్పు కాఫీ ఇచ్చి ఏం సార్...! మట్కా ఆడుతున్నారా? దొంగతనం చేశారా? దొంగ ఇసుక అమ్ముతున్నారా అని మాట్లాడడం మన పోలీసు సిద్ధాంతమేమో! ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటే? ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో పోలీసులను కొట్టినా వారిపై చర్యలు తీసుకోలేని పరిస్థితిలో పోలీసులు ఉండడం మంచిదికాదు. జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉంటే శాంతిభద్రతలను ఏవిధంగా కాపాడతారు? చర్యలు తీసుకునేందుకు పోలీసులకు చేవ చచ్చిపోయిందా? తప్పుడు నాయాళ్లను కుర్చీలో కూర్చోబెట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే సరిపోతుందా’ అని విరుచుకుపడ్డారు. జిల్లాలో పోలీసులకు అసలు వెన్నుముకే లేదన్నారు. గ్రామాల్లో పెద్దమనుషులుగా చలామణీ అవుతున్న వారి వద్దకు, దాదాగిరి చేసేవాళ్ల వద్దకు వెళ్లి పనిచేయించుకోవాల్సి వస్తోందని చెప్పారు. దీనిని సీఎం చంద్రబాబు, డీజీపీ ఠాకూర్ల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
