Published: 05-09-2018
ఏ పార్టీతో పొత్తుండదు.....టీడీపీతో కలిసే ప్రసక్తే లేదు

ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీతో కలసి పోటీ చేసే ప్రసక్తేలేదన్నారు. మంగళవారం విజయవాడలోని పీసీసీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని, ఇది అతిపెద్ద స్కాం అని ఆరోపించారు. ‘దేశ భద్రతంటే చిన్నపిల్లలాట కాదు.. ఏమాత్రం అనుభవంలేని సంస్థలకు బాధ్యతలను అప్పగించడం క్షమార్హం కాదు. ప్రధాని మోదీ దేశ భద్రతా వ్యవస్థలోనే అత్యంత కీలకమైన రక్షణ వ్యవస్థతో ఆటలాడుతున్నారు. రాఫెల్ అవినీతిలో ఆయనకు వాటా ఉంది. రూ.41 వేల కోట్ల ఒప్పందాన్ని రిలయన్స్ కోసం ఒక్కసారిగా రూ.1,41,000 కోట్లకు పెంచేశారు. దీనిపై దర్యాప్తు జరిపించాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరుతుంటే కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది’ అని అన్నారు.
ఈ స్కామ్లో మోదీ, అనిల్ అంబానీ మధ్య ప్రత్యక్షంగా డీల్ కుదిరిందని ఆరోపించారు. అనిల్ అంబానీని విఫల వ్యాపారవేత్తగా అభివర్ణించారు. రాఫెల్ ఒప్పందంలో అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 12న జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి కాంగ్రెస్ నేతలు మెమోరాండం సమర్పిస్తారని మొయిలీ చెప్పారు. కాగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఈ నెల 18న కర్నూలు రానున్నారు. ఈ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్ చాందీ గురువారం కర్నూలు రానున్నారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో కలిసి.. బహిరంగ సభ స్థలం.. ఏర్పాట్లపై నాయకులతో సమీక్షిస్తారు. విద్యార్థులతో చాందీ ముఖాముఖి కూడా నిర్వహిస్తారు.
