Published: 01-09-2018
బ్యాంకులకు వరుస సెలవులు వదంతులే

విజయవాడ: బ్యాంకులకు వరుస సెలవులు వదంతులే అని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల మూడో తేదీ సోమవారం నుంచి శనివారం వరకు బ్యాంకులకు సెలవు దినాలంటూ వాట్సప్ గ్రూప్ల్లో హల్చల్ చేస్తోంది. నాలుగు రోజులుగా వచ్చే వారంలో బ్యాంకు పని దినాలు లేవని ఆర్థిక లావాదేవీలను ముందుగా ప్లాన్ చేసుకోవాలని దీని సారాంశం! ఇవి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ నెల మూడో తేదీ సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి, మంగళ, బుధవారాలు బ్యాంకులు స్ట్రయిక్ అని గురువారం భారత్ బంద్ అంటూ మేసెజ్ చక్కర్లు కొట్టడంతో ఖాతాదారులు ముందుగానే డబ్బు పెద్ద మొత్తంలో డ్రా చేసుకోవాలని భావిస్తున్నారు.
దీనిపై బ్యాంకు అధికారులను వివరణ కోరగా వాట్సాప్లో వస్తున్న మెసేజ్లో నిజం లేదన్నారు. ఖాతాదారులు ఎవరూ దీన్ని నమ్మవద్దని చెప్పారు. బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయన్నారు. వచ్చే వారం 4, 5 తేదీల్లో బ్యాంకు స్ట్రయిక్ అనేది అవాస్తవమని తెలిపారు. ఆర్బీఐలో కొంతమంది ఎంప్లాయీస్ మాత్రమే సమ్మె చేస్తున్నట్లు విజయా బ్యాంకు బెంజిసర్కిల్ శాఖ మేనేజర్ మురళీకృష్ణ తెలియజేశారు. బ్యాంకులకు ఎటువంటి సెలవులు లేవని వాట్సాప్ల్లో వస్తున్న సమాచారాన్ని నమ్మవద్దని చెప్పారు.
