Published: 22-08-2018
వ్యభిచార ముఠాలపై ఉక్కుపాదం: డీజీపీ

రాష్ట్రంలో ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పిస్తాం.. మానవ అక్రమ రవాణా ముఠాలపై ఉక్కుపాదం మోపుతాం అంటూ.. డీజీపీ ఆర్పీ ఠాకూర్ మహిళా లోకానికి భరోసా ఇచ్చారు. హ్యూమన్ ట్రాఫికింగ్పై ‘ప్రజ్వల’ స్వచ్ఛంద సంస్థ.. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారంతో 234 పేజీల పుస్తకాన్ని (ఏపీ పోలీస్ ట్రైనింగ్ మాన్యువల్) ప్రచురించింది. దేశంలో మానవ అక్రమ రవాణా, ఆపై శ్రమ దోపిడీ, శరీరాలతో వ్యాపారం, ముఠాల చిత్రహింసలు, బాధితుల అనుభవాలు.. ఇలా అన్ని కోణాలనూ స్పృశించి కేస్ స్టడీస్ తో రూపొందించింది. ఈ మాన్యువల్ను మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు హెడ్ క్వార్టర్స్లో డీజీపీ ఆర్పీ ఠాకూర్ మంగళవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజ్వల వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ పోలీసుల సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో ఎందరో బాలికలు, యువతులు, మహిళల్ని నరక కూపాల నుంచి బయటకు తీసుకొచ్చారంటూ అభినందించారు. సునీతా కృష్ణన్ మాట్లాడుతూ... మహిళలు, బాలికలు, యువతులే గాక బాలురు సైతం శ్రమదోపిడీ, లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శాంతి భద్రతల ఏడీజీ హరీశ్ కుమార్ గుప్తా, సీఐడీ చీఫ్ అమిత్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యభిచార కూపాల నుంచి బయటపడిన పలువురు బాధితుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. వాటిలో కొన్ని...
చేయి కోసుకుంటే కారం పెట్టారు..
ఢిల్లీలోని వ్యభిచార కూపం నుంచి బయటపడ్డ పలమనేరు(చిత్తూరుజిల్లా) బాధితురాలు మాట్లాడుతూ.. పేద కుటుంబం లో జన్మించిన తనను ఒకామె పని ఇప్పిస్తానని ఢిల్లీ తీసుకెళ్లి వ్యభిచార ముఠాకు అమ్మేసిందని చెప్పింది. అక్కడ విటులతో గడపాలని వ్యభిచార ముఠాలు ఒత్తిడి తెచ్చాయని, అందుకు వ్యతిరేకించి బ్లేడుతో చేయి కోసుకుంటే కారం చల్లి మరింత హింసించారని కన్నీరు పెట్టుకుంది. చివరికి ప్రజ్వల సహకారంతో ఆ నరకం నుంచి బయటపడ్డానని పేర్కొంది.
చెల్లీ.. అని చెరిచాడు..
రాజమండ్రికి చెందిన మరో యువతి మాట్లాడుతూ... ‘పాఠశాలలో ర్యాగింగ్ చేసిందుకు తనను చదువు మాన్పించి మైనర్కు పెళ్లి చేసేందుకు అమ్మ(తండ్రి లేడు) ప్రయత్నించగా ఇంటి నుంచి పారిపోయి బస్టాండుకు వచ్చా. అక్కడ తన అన్న స్నేహితుడు కనిపించి ఏంటి చెల్లి ఇక్కడున్నావని ఆప్యాయంగా పలకరించాడు. ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి తనపై అత్యాచారం చేశాడని వివరించింది. రేప్ వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేసి వ్యభిచార ముఠాలకు అమ్మేశాడని వాపోయింది.
కేరళవాసిగా దండం పెడుతున్నా: సునీతాకృష్ణన్
‘నాది కేరళ... నా కుటుంబసభ్యులు వరద నీటిలో ఇప్పటికీ బిక్కుబిక్కుమంటున్నారు... మొత్తం కేరళీయులు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు... అటువంటి వారికి ఏపీ పోలీసులు రూ. 8 కోట్ల విరాళం అందించారు... కేరళ వాసిగా డీజీపీ ఆర్పీ ఠాకూర్కు దండం పెడుతున్నా’ అని సునీత కృష్ణన్ కన్నీటిపర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.
