రక్షణలో తిరుపతికి రెండో ర్యాంకుపై డీజీపీ

కలియుగ వైకుంఠం తిరుపతిలో భక్తుల రక్షణకు పోలీసుశాఖ ప్రతిష్ఠాత్మక చర్యలు చేపట్టిందని డీజీపీ ఆర్పీ ఠాకూర్ అన్నారు. దేశ వ్యాప్తంగా 5లక్షల లోపు జనాభా ఉన్న 111 నగరాల్లో తిరుపతి నాలుగో స్థానంలో నిలవగా రక్షణ పరంగా రెండో స్థానం సాధించడానికి పోలీసులు చేపట్టిన చర్యలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. భక్తుల రక్షణ, మెరుగైన ట్రాఫిక్, టెక్నాలజీ వినియోగం తదితర చర్యలు చేపట్టిన శాంతి భద్రతల ఏడీజీ హరీశ్ కుమార్ గుప్తా, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతిని ఆదివారం మంగళగిరిలో పోలీసు హెడ్ క్వార్టర్స్లో డీజీపీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర నగరాలు, పట్టణాలతో పోల్చితే తిరుపతిలో ప్రతిరోజు లక్షమందికి పైగా కొత్తవ్యక్తులు వచ్చి వెళుతుంటారని, అక్కడ క్రైమ్, ట్రాఫిక్ కంట్రోల్ పోలీసులకు పెద్ద సవాలని చెప్పారు. ఇటువంటి నగరంలో పోలీసుశాఖ నిరంతం అప్రమత్తంగా ఉండటంవల్ల ఎలాంటి భయం లేకండా భక్తులు దేవుడిని దర్శించుకొని సంతోషంగా వెళుతున్నారని వివరించారు.
