Published: 19-08-2018
కేంద్రం వరుస వంచనలతో కుదేలవుతున్న ఆంధ్రా...

కేంద్రం వరుస వంచనలతో కుదేలవుతున్న రాష్ట్రానికి, మరో పెద్ద కష్టం వచ్చిపడింది. రాష్ట్రాల్లో అమలవుతున్న వాటర్షెడ్లకు కేంద్రప్రభుత్వం నిధులు ఆపేసింది. దీంతో నీటి సంరక్షణ, పొదుపు కోసం వేగవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు బ్రేకులు పడ్డాయి. కొత్తగా మంజూరు అయిన ఆరో బ్యాచ్ వాటర్షెడ్లను ‘సొంత’ నిధులతో నడుపుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా వాటర్షెట్లను నిర్వహిస్తున్నా, ఈ పథకం మన రాష్ట్రంలోనే ఎక్కువగా సత్ఫలితాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం దెబ్బ ఏపీపైనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో వాటర్షెడ్ల పథకంలో పనిచేస్తున్న సిబ్బంది రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే పరిస్థితి లేకపోవడం, ఉన్న ప్రాజెక్టులకు కూడా నిధులు ఆగిపోవడంతో వీరిలో ఆందోళన ఎక్కువైంది. ప్రస్తుతం 790 మంది కాంట్రాక్టు ఉద్యోగులు వాటర్షెడ్ పథకంలో పని చేస్తున్నారు. మొదట్లో ప్రారంభమైన ప్రాజెక్టులు 90 శాతం దాకా పూర్తయ్యాయి. దీంతో ఈ ఉద్యోగుల్లో చాలామంది ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. కొత్త ప్రాజెక్టులు మంజూరయితేనే వీరి పని ఉంటుంది. అయితే, తాము కొత్త పథకాలను కేటాయించబోవడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో వీరిలో ఎక్కవమంది అభద్రతకు గురవుతున్నారు. సాధారణంగా ఒక్కో బ్యాచ్లో 56% ఎన్ఆర్ఎం పనులు (నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ వర్క్స్) చేపడతారు. ఈ పనులు నిర్వహించేందుకు మాత్రమే సిబ్బంది అవసరం. ఇందులో బ్యాచ్ 1లో 95%, బ్యాచ్ 2 లో 90%, బ్యాచ్ 3లో 57%, బ్యాచ్ 4లో 44%, బ్యాచ్ 5లో 13% ఎన్ఆర్ఎంకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. బ్యాచ్-6లో ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ బ్యాచ్కు నిధులు ఆపేయడంతో దాని మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అంటే బ్యాచ్-1, బ్యాచ్-2, బ్యాచ్-3లకు సంబంధించిన వాటర్షెడ్లు నిర్వహణకు సంబంధించి ఇక సిబ్బందితో అవసరం లేదు. బ్యాచ్ 4లో కూడా మరో 12ు పనులు చేస్తే ఆ బ్యాచ్లో కూడా సాంకేతికపరంగా చేసే పనులు పూర్తవుతాయి. ఇక బ్యాచ్ 5లో పూర్తిగా గిరిజన ప్రాంతానికి చెందిన వాటర్షెడ్ల కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ కేవలం గిరిజన ప్రాంతాలకు చెందిన వారిని నియమించి పనులు నిర్వహించాల్సి ఉంది. ఆరో బ్యాచ్కు నిధులు ఆగిపోవడంతో ఆ బ్యాచ్ ప్రాజెక్టు పనులు కొనసాగే పరిస్థితి లేదు. ఇప్పటికే పలు జిల్లాల్లో సిబ్బందిని పని లేకుండా ఖాళీగా డ్వామా ఆఫీసుల్లోను, ప్రాజెక్టు ఏరియా కార్యాలయాల్లోను కూర్చోబెడుతున్నారు. నిధులు లేక సుమారు 100 మందికి పైగా కాంట్రాక్టు సిబ్బందికి జీతాలు ఆపేశారు. దీంతో తమ ఉద్యోగాలుంటాయా పోతాయా అనే ఆందోళనలో సిబ్బంది ఉన్నారు. ఈ విషయంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల తీరు కూడా విమర్శలకు గురవుతోంది. కొత్త వాటర్షెడ్లు మంజూరు నిలిపేస్తామని ఏడాది కిందటే కేంద్రం హెచ్చరించింది. అయితే, ఈ సిబ్బందిని సర్దుబాటు చేయడానికి శాఖ అధికారులు ప్రయత్నాలు చేయలేదని చెబుతున్నారు. ఉపాధి హామీ పథకంలో ఈ సిబ్బందిని వినియోగించుకునే వెసులుబాటు ఉన్నా ఆ పని చేయలేదు. వాటర్షెడ్ సిబ్బందికి ఏడాదికి రూ. 1.20 కోట్లు వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వంపై పడింది.
సీఎం లేఖ రాసినా..
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇప్పటికి ఆరు బ్యాచ్ల్లో వాటర్షెడ్లు మంజూరుచేసింది. 2009 నుంచి 2014-15 వరకు.. రూ.2,900 కోట్లతో 432 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఒకటో, రెండో తప్ప అన్నీ దాదాపు పూర్తి కావొస్తున్నాయి. అయితే కొత్తగా వాటర్షెడ్ ప్రాజెక్టులను మంజూరుచేసేది లేదని, ఉపాధి హామీ పథకంలో భాగంగానే నీటి సంరక్షణ పనులూ చేపట్టాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అన్నీ రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా మరికొన్ని వాటర్షెడ్లు నవ్యాంధ్రప్రదేశ్కు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసినప్పటికీ, కేంద్ర మంత్రి నుంచి ఇదే సమాధానమొచ్చింది.
