Published: 12-08-2018
తునిలో రైలును చంద్రబాబే తగలబెట్టించారు

కాపు ఉద్యమ సమయంలో తునిలో ముఖ్యమంత్రి చంద్రబాబే రైలును తగలబెట్టించారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం ఆయన తునిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. హామీలు నెరవేర్చాలని కాపులు చేపట్టిన చేపట్టిన ఉద్యమంలో రైలును తగలబెట్టించి... ఆ కేసులను వైసీపీ కార్యకర్తలపై మోపారని జగన్ పేర్కొన్నారు. రాజకీయ కోణంలో ఆలోచిస్తూ ఇతర వర్గాలపైనా కేసులు పెట్టారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేసులను ఎత్తివేస్తామని ప్రకటించారు.
చంద్రబాబు తన పాలనతో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించారని, ఆయనను పొరపాటున క్షమిస్తే వచ్చే ఎన్నికల్లో మరిన్ని హామీలు ఇచ్చి మోసం చేస్తారన్నారు. చంద్రబాబు మోసం వల్ల అక్కచెల్లెళ్లు కన్నీరు పెట్టే పాలన జరుగుతోందని జగన్ విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే విద్యా వ్యవస్థల్లో మార్పులు తీసుకొస్తామని... ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ఇంగ్లిషు మీడియం స్కూళ్లుగా మారుస్తామని జగన్ ప్రకటించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఫీజులు భరించలేక 32 శాతం మందికి చదువుకునే అవకాశం లేని పరిస్థితి ఉందన్నారు. పిల్లల చదువులకు ఎన్ని లక్షలు ఖర్చయినా ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలకు ఏడాదికి 20 వేలు ఇస్తామన్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు ప్రాతినిధ్యం వహిస్తున్న తుని నియోజకవర్గంలో ఉచిత ఇసుక దొరకని పరిస్థితి ఉందన్నారు. తాండవ నదిలో ఒక చెంచా ఇసుక కూడా లేకుండా దోచుకున్నారన్నారు. పోలవరం కాలువ తవ్వకాల్లో ఐదవ ప్యాకేజీ పనులు వైఎస్ హయాంలో 70 శాతం పూర్తిచేయగా... మిగిలిన 40 శాతం పనులను యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్కు అప్పగించారన్నారు.
