Published: 04-08-2018
చంద్రబాబును బర్తరఫ్ చేసే సమయమే లేదా.

‘గవర్నర్ ఏం చేస్తున్నారు? అవినీతి చక్రవర్తి చంద్రబాబును బర్తరఫ్ చేసే సమయమే లేదా..? ఆంజనేయస్వామి దర్శనాలు, పొర్లుదండాలు పెట్టడానికే ఆయనకు సమయం చాలనట్టుంది.. జాతీయ ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిపై ఆధారాలతో గత నెల 31న ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశాం.. ఇంతవర కు పట్టించుకోలేదు’ అని గవర్నర్ నరసింహన్పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడారు. ‘చట్టాలు తననేమీ చేయలేవనే భావన తో చంద్రబాబు ఉన్నారు. ఆయనకు కొన్ని సంస్థలు, వ్యక్తుల సపోర్టు ఉంది. అందుకే అహంకారం. ఇటీవల నేను సాక్ష్యం సినిమా చూశాను. ఇక్కడ భగవంతుడు ఉన్నాడు. ప్రకృతి ఉంది. ఎవరూ చూడడం లేదనుకోవద్దు, పంచభూతాల సాక్ష్యం ఉంది. చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలి’ అని హెచ్చరించారు. సీఎం రూలింగ్ మానేసి ట్రేడింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఆ ట్రేడింగ్తో డబ్బు సంపాదించి మరోసారి గద్దెనెక్కాలని చూస్తున్నారని అన్నారు.
‘భోగాపురం ఎయిర్పోర్టు ను ఏఏఐకి కాకుండా జీఎంఆర్ సంస్థకు అప్పగించడానికి రంగం సిద్ధం చేశారు. దీని వెనుక భారీ అవినీతి బాగోతం జరిగింది. కరుడుకట్టిన తీవ్రవాదిలా అవినీతిలో చంద్రబాబు కూడా వెనకడుగు వేయట్లేదు. దేశంలో ఇటువంటి వ్యక్తిని చూడలేం. ఏపీలో ఇటువంటి వ్యక్తి నభూతో నభవిష్యత్. సీఎం బరితెగింపుపై చర్చ జరగాలి’ అని డిమాండ్ చేశారు. విద్యా రంగంలో అవినీతి భారీగా జరుగుతోంది. వియ్యంకులైన మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు, పురపాలక మంత్రి పి.నారాయణ ఈ రంగాన్ని దోచేస్తున్నారని వీర్రాజు ఆరోపించారు.
