Published: 17-06-2018

రంజాన్‌ వేడుకల్లో ఘర్షణ..

 డోన్‌ పట్టణంలో జరిగిన రంజాన్‌ వేడుకలో ముస్లింల మధ్య ఘర్షణ జరిగింది. రెండువర్గాలుగా విడిపోయి ముస్లింలు కొట్టుకున్నారు. శనివారం పట్టణంలోని చిగురుమానుపేటలో గల మసీదు ఆవరణలో రంజాన్‌ వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని ముస్లిం లు భారీగా తరలివచ్చి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మదరసాలో ఉండే నిరుపేద ముస్లింల చదువుల కోసం విరాళాలు ఇవ్వాలని కమిటీ సభ్యులు కోరారు. దీంతో ఒక వర్గానికి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు రూ.50వేలు విరాళం ప్రకటించారు. దీనిని మరో వర్గం ముస్లింలు వ్యతిరేకించారు. ముందుగా కమిటీకి సంబంధించిన ఖర్చులు, వాటికి సంబంధించిన లెక్కలు చూపాలని అడిగారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది.
 
 
రహింఖాన్‌, అక్బర్‌బాషా వర్గానికి చెందిన ముస్లింలు మరో వర్గానికి చెందిన జాకీర్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. అక్కడే ఉన్న డీఎస్పీ బాబాఫకృద్దీన్‌ జోక్యం చేసుకొని పరిస్థితి చక్కదిద్దారు. అయితే ఆ తర్వాత పట్టణంలోని కొత్తపేటలో గల ఈద్గా మసీదులోనూ ముస్లిం సోదరుల మధ్య ఘర్షణ జరిగింది. ఓ వర్గానికి చెందిన ముస్లింలు మరో వర్గానికి చెందిన వ్యక్తిపై దాడికి దిగారు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేయడంతో గొడవ సద్దుమణిగింది.