‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో మంత్రి గంటా

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని విద్య, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం రాజధానిలోని మందడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో మంత్రి గంటా ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 16 వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా విద్యపై లోటు పడకూడదనే 25 వేల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంతగా మెరుగ్గా లేవని, నేడు మోడల్ పాఠశాలలుగా రూపొందిస్తున్నట్టు చెప్పారు. 5 వేల కోట్లతో పాఠశాలల్లో వసతులు ప్రవేశపెడుత్నుట్టు చెప్పారు. ఉపాధ్యాయుల కొరత లేకుండా డీఎస్సీ ద్వారా త్వరలో 10,300 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. రాష్ట్రం నూటికి నూరు శాతం అక్ష్యరాస్యత సాధించాలనేది ప్రభుత్వం ఉద్దేశమన్నారు. అందుకు ఫౌండేషన్ కోర్సులు, వర్చువల్ తరగతులు, ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. మందడం జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలకు లక్ష విరాళం అందించిన సర్పంచ్ ముప్పవరపు పద్మావతిని, పాఠశాల అవసరాలకు లక్ష రూపాయలు డిపాజిట్ చేసిన ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియమ్మను, స్వాతంత్య్ర సమర యోధుడు పావులూరి శివరామ కృష్ణను , విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణిని, జిల్లా విద్యా శాఖ అధికారులను , మానసిక స్థితి అంతగా లేకున్నా పదవ తరగతి పాసైన అమరావతి మండలం ధరణికోటకు చెందిన శ్యామలా గౌరీని మంత్రి గంటా దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేసారు. సభకు ఎమ్మెల్సీ రామకృష్ణ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ జానీమూన్ తదితరులు పాల్గొన్నారు.
