విశాఖపట్నంలో ''ఎండ కంటే'' ఎక్కువగా మండుతున్న..... డీజిల్ ధరలు

పెట్రోలు, డీజిల్ ధరలు ఆదివారం రికార్డు స్థాయికి చేరుకున్నాయని, పెట్రోలుపై 33 పైసలు, డీజిల్పై 26 పైసలను చమురు సంస్థలు పెంచాయని ఈనాడు కథనం వెల్లడించింది.
ఈ ధరల ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. దేశంలోనే అత్యధిక ధర ఆంధ్రప్రదేశ్లో నమోదైంది.
కర్నూలులో దేశంలోనే పెట్రోలు ధర అత్యధికంగా రూ.84.62 ఉంది. ఆ తర్వాత స్థానంలో ముంబయిలో లీటరు రూ.84.07 పలుకుతోంది. భోపాల్లో రూ.81.83, పట్నాలో రూ.81.73, శ్రీనగర్లో రూ.80.35గా, కోల్కతాలో రూ.78.91, దిల్లీలో రూ.76.34, చెన్నైలో రూ.79.13గా ఉంది.
గోవా రాజధాని పనాజీలో దేశంలోని మిగతా అన్నిచోట్ల కంటే తక్కువగా లీటరు ధర రూ.70.26 ఉంది.
డీజిల్ ధర విశాఖపట్నంలో ఎక్కువగా ఉంది. అక్కడ లీటరు డీజిల్ ధర రూ.73.95గా ఉంది. హైదరాబాద్లో రూ.73.45 పలుకుతోంది. మిగిలిన చోట్లా ధర రూ.70 దాటింది. ఒక్క అండమాన్లోని పోర్ట్ బ్లెయిర్లో మాత్రం రూ.63.65కు దొరుకుతోంది.
క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 115 డాలర్లు ఉన్నపుడు 2013 ప్రాంతంలో డీజిల్ లీటరు ధర రూ.71 గరిష్ఠంగా నమోదైంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర 79 డాలర్లే ఉన్నప్పటికీ డీజిల్ ధర లీటరు రూ.75 దాటడం గమనార్హం.
