Published: 03-08-2019
విశాఖ వైపు గల్ఫ్ సంస్థలు మొగ్గుచూపినా....కనికరించని కేంద్రం

రాష్ట్రంలోని ఎయిర్పోర్టుల నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడవడం ఇప్పట్లో సాధ్యపడేలా లేదు. విజయవాడ, తిరుపతి నుంచి కొత్త సర్వీసులు ప్రారంభించడానికి, విశాఖ నుంచి మరిన్ని నగరాలకు విస్తరించడానికి గల్ఫ్ దేశాలకు చెందిన కొన్ని విమానయాన సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను కేంద్రం అడ్డుకొంటున్నట్లు సమాచారం. ఈ నగరాల నుంచి ఆశించిన స్థాయిలో అంతర్జాతీయ ట్రాఫిక్కు ఆవకాశం ఉన్నా ఒక్క విశాఖ మినహా మిగిలిన రెండు నగరాల నుంచి గల్ఫ్కు విమానాల ఊసే లేదు. తిరుపతి నుంచి ఒక్క అంతర్జాతీయ విమానం కూడా లేదు. ప్రస్తుతం దుబాయి నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖకు ఎయిర్ ఇండియా సర్వీసును నడుపుతోంది. ఇది లాభదాయక రూట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ మార్గంలో విమానాలు నడపడానికి కొన్ని గల్ఫ్ సంస్థలు ప్రయత్నిస్తున్నా కేంద్రం అనుమతించడం లేదని సమాచారం. ఇక విజయవాడ రూట్లో కూడా మంచి ఆవకాశాలున్నప్పటికీ డిమాండ్ ఉన్న గల్ఫ్ను కాదని సింగపూర్కు సర్వీసులు నడిపారు. అదీ వయబులిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) కింద కొంతకాలం నడిపి, ఆ తర్వాత ఆపేయడం విమర్శలకు తావిచ్చింది. కువైత్లోని జజీరా ఎయిర్లైన్స్ దక్షిణాదిన విస్తరించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆ సంస్థతో చర్చించి తిరుపతి నుంచి అంతర్జాతీయ విమానాలు నడిపించే ఆవకాశం ఉంది.
ఏపీతో సహా దేశంలోని ఇతర నగరాల నుంచి గల్ఫ్ దేశాలకు నూతన విమాన సర్వీసులను అనుమతించడంలో మోదీ సర్కారు వ్యూహాత్మక నిరాకరణ వైఖరిని అవలంబిస్తోందని చెబుతున్నారు. భారత్- కువైత్ మధ్య వారానికి 12వేల మంది, భారత్- యూఏఈ మధ్య వారానికి 66,503 మంది ప్రయాణికులను ఇరుదేశాలకు చెందిన ఎయిర్లైన్స్ రవాణా చేసేందుకు ద్వైపాక్షిక ఒప్పందాలున్నాయి. గల్ఫ్ దేశాల ఎయిర్లైన్స్ తమ కోటాను పూర్తిగా వినియోగిస్తుండగా, భారతీయ ఎయిర్లైన్స్ మాత్రం విమానాల కొరతతో వెనుకబడ్డాయి. జెట్ ఎయిర్వేస్ మూతతో భారత్ సామర్థ్యం మరింత తగ్గింది. మరోవైపు యూఏఈ, కువైత్ విమానయాన సంస్థలు భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి కేంద్రం ససేమిరా అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా కనెక్టివిటీ ఉన్న యూఏఈ తమ ఎయిర్లైన్స్ను భారత్లో విస్తరించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. విమానాల సీట్ల పెంపునకు ద్వైపాక్షిక ఒప్పందాన్ని సవరించాలని కేంద్రం పై ఒత్తిడి తెస్తోంది. విజయవాడతో పాటు విశాఖ, తిరుపతికి సర్వీసులు నడిపేందుకు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్కు అనుమతిస్తే, మొత్తం గల్ఫ్తో పాటు అమెరికా, యూ రోప్ ప్రయాణికులకు కనెక్టివిటీ లభిస్తుంది. అయితే ద్వైపాక్షిక ఒప్పందాలను సవరించడానికి కేంద్రం సుముఖంగా లేకపోవడంతో రాష్ట్రానికి అంతర్జాతీయ సంస్థల విమానాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
