Published: 28-07-2019
కొత్త ప్రభుత్వంలోనూ మారని పరిస్థితి

మీణ పక్కా ఇళ్లకు చెల్లించాల్సిన ఇటుకల రాయితీ విషయంలో కొత్త ప్రభుత్వంలోనూ సానుకూల వాతావరణం కనిపించడం లేదు. గత ప్రభుత్వం నుంచీ పెండింగ్లో ఉన్న రూ.549కోట్ల రాయితీలు ఇప్పుడైనా విడుదలవుతాయని లబ్ధిదారులు ఆశించగా, కొత్త ప్రభుత్వం ఇంతవరకూ ఒక్కరికి కూడా బిల్లులు విడుదల చేయలేదు. పురోగతిలో ఉన్న ఇళ్లకే బిల్లులు ఆగిపోయిన నేపథ్యంలో పాత ఇటుకల రాయితీలు ఇస్తారా? అని సందేహాలు పెరిగిపోతున్నాయి.
ఇటీవల హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల వేతనాల చెల్లింపులే నిధుల లేవనే కారణంతో కొంత కాలం ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇటుకల రాయితీలు ఎప్పుడు విడుదలవుతాయనేది అర్థంకాని విషయంగా మారింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇంటికి రూ.లక్షన్నర రాయితీ ఇచ్చారు. అందులో కాంపోనెంట్ల వారీగా బేస్మెంట్కు, గోడలకు, శ్లాబులకు వేర్వేరుగా రాయితీలు ఇస్తారు. అందులో భాగంగా ఇటుకల రాయితీ కింద ఒక్కో ఇంటికి రూ.25వేలు ఇచ్చేవారు.
2017 వరకూ రాయితీలు సక్రమంగానే విడుదలయినా అక్కడి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయు. ఇటుకల రాయితీని ఉపాధిహామీ నిధులతో అనుసంధానం చేయడంతో వాటిని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఇళ్ల లబ్ధిదారులకు ఇటుకల రాయితీ ఇవ్వాలంటే లబ్ధిదారులు సొంతంగా ఇటుకలు తయారుచేసుకోవాలనే నిబంధన ఉపాధి హామీలో ఉందని, రాష్ట్రంలో ఎవరూ అలా సొంతంగా తయారుచేయకపోవడం వల్ల నిలిపివేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో ఆ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. ఆ రాయితీలు క్రమంగా పెరిగి రూ.549కోట్లు అయ్యాయి.
అయితే అనంతరం చేపట్టిన ఇళ్లకు ఇటుకలు రాయితీలు బాగానే ఇచ్చినా... 2016, 2017 సంవత్సరాల్లో కట్టిన వాటికి మాత్రం ఆగిపోయాయి. నిర్మాణంలో ఉన్న వాటికి ఇవ్వకపోతే కష్టమని భావించిన ప్రభుత్వం పాత ఇళ్లకు నిలిపివేసి, పురోగతిలో ఉన్నవాటికి మాత్రం చెల్లించింది. అనంతరం నిధులు లేవనే కారణంతో ఆ బిల్లులు విడుదల చేయలేదు. ఇటీవల ప్రభుత్వం మారడంతో ఇప్పుడైనా రాయితీలు విడుదల చేస్తారని లబ్ధిదారులు ఆశతో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం రెగ్యులర్ బిల్లులే చెల్లించకపోతుండటంతో ఇక ఇటుకల రాయితీలు ఇప్పట్లో వస్తాయా? అని దాదాపు 2లక్షల మంది లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
