Published: 14-07-2019
బడ్జెట్లో వారికేమిచ్చారు?.. డ్వాక్రా రుణాల రద్దేదీ

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోటిన్నర మంది నిరుద్యోగుల గురించి మాట్లాడిన జగన్.. ఇప్పుడు బడ్జెట్లో వారికేమిచ్చారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర బడ్జెట్పై శనివారం ఆయన ట్విటర్లో స్పందించారు. ‘మేం ఐదు లక్షల మందికి పైగా నిరుద్యోగ భృతి ఇస్తుంటే రాష్ట్రంలో 1.72 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని.. వారి సంగతేమిటని ఆ రోజు మీరు (జగన్) ప్రశ్నించారు. మరి మీ బడ్జెట్లో ఆ నిరుద్యోగుల ఊసు ఎందుకు లేదు? మీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉన్న 1.72 కోట్ల మంది నిరుద్యోగులకు ఏమిస్తున్నారో చెప్పాలి’ అని కోరారు.
నోటికి వచ్చిన హామీలతో జగన్ చిటికెల పందిరి కట్టారని, ఇక ఆ పందిరి మీద అభివృద్ధి, సంక్షేమం పాకించి పండిస్తామంటున్నారని చంద్రబాబు ఎద్దేవాచేశారు. ‘ఇది అయ్యే పనేనా? రాజధానికి రూ.500 కోట్లు, కడప స్టీల్ ప్లాంట్కు రూ.250 కోట్లు కేటాయించి ఏం కట్టాలని? ప్రజల ఆకాంక్షల్ని ఎందుకిలా నీరుగారుస్తున్నారు’ అని ప్రశ్నించారు. డ్వాక్రా మహిళలకు ఐదేళ్లపాటు తలా రూ.75 వేలు ఇస్తామన్నారని, డ్వాక్రా రుణాలు కూడా రద్దు చేస్తామన్నారని.. అవి ఏమయ్యాయని నిలదీశారు. ‘బడ్జెట్లో వాటి ఊసు కనిపించలేదు. డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలకు రూ.1788 కోట్లు మాత్రం కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. మరీ ఇంత మోసమా’ అని దుయ్యబట్టారు. జగన్ పాలనలో రానున్న రోజులు ఎంత అధ్వానంగా ఉండబోతున్నాయో వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఈ బడ్జెట్ స్పష్టం చేసిందని చెప్పారు. అమ్మ ఒడి పథకానికి ఇన్ని ఆంక్షలా అని విస్మయం వ్యక్తం చేశారు. హామీ ఇస్తే అమలు చేసే సత్తా ఉండాలని, ఆ సత్తా గానీ, చిత్తశుద్ధి గానీ ఈ ప్రభుత్వానికి లేవని ఆయన విమర్శించారు.
బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యసభలో వాకౌట్ చేశానని వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి చెప్పుకొంటున్నారని, మరి ఆ పార్టీ ఢిల్లీలో బీసీలకు ఒక్క పదవైనా ఇచ్చిందా అని టీడీపీ అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ‘పార్లమెంటరీ పార్టీ నేత పదవి విజయసాయి రెడ్డికి ఇచ్చారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవీ ఆయనకే. లోక్సభాపక్ష నేత పదవి మిఽథున్ రెడ్డికి ఇచ్చారు. ఈ పదవులు ఇచ్చే ముందు బీసీ నేతలు కనిపించలేదా’ అని ట్విటర్లో ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ ఇంటి ముందు రోడ్డు వేయడానికి రూ.5 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం.. రాజధాని నిర్మాణానికి బడ్జెట్లో రూ.500 కోట్లు విదిల్చిందని ఆక్షేపించారు. టీడీనీ హయాంలో అమరావతి నిర్మాణం ఎలా పరుగులు పెట్టిందో... ఇప్పుడు ఎలా పడకేసిందో బహిరంగంగా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. సమయం, స్థలం విజయసాయి నిర్ణయిస్తే రావడానికి రెడీ అని సవాల్ విసిరారు. టీడీపీ ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా కట్టలేదని విమర్శిస్తున్న విజయసాయి.. పట్టిసీమ గురించి ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు మీ మంత్రులు కూడా వెళ్లొచ్చారని, అది కూడా గుర్తు లేనంతగా ఆయనకు చత్వారం, అల్జీమర్స్ వ్యాధులు వచ్చాయని పేర్కొన్నారు.
