Published: 06-05-2019
పెండింగ్లో చట్టసభ్యుల చలానాలు..

వారంతా చట్టాలను చేసే శాసనసభ్యులు.. వారే చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. వారి వాహనాలు రోడ్డెక్కితే ‘రయ్...’మంటూ దూసుకెళ్తాయి. ‘నో పార్కింగ్’ ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా వాహనాలను నిలుపుతున్నారు. సర్వీస్ రోడ్లను పార్కింగ్లాట్గా భావిస్తున్నారు. ఏళ్ల తరబడి తమ వాహనాలపై జారీ అవుతున్న చలానాలను పట్టించుకోవం లేదు. నోటీసులను బేఖాతరు చేస్తున్నారు. సామాన్యుడి విషయంలో మూడు.. నాలుగు చలానాలు దాటితే రోడ్డుపై దొరికిన వాహనాలను దొరికినట్లు సీజ్ చేస్తూ.. చార్జిషీట్లు దాఖలు చేసి కోర్టుకీడుస్తున్న ట్రాఫిక్ పోలీసులు సైతం వీరి విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ‘అతివేగం/ప్రమాదకరమైన డ్రైవింగ్’కు గాను ఎక్కువ మొత్తంలో చలానాలు పొందిన నేతల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ టాప్ ప్లేస్లో ఉన్నారు. ఆయన వాహనంపై రూ.46,300 మేర చలానాలు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ 2016 ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 26 వరకు నమోదైనవే.
మొత్తం 40 చలానాల్లో 36 అతివేగం/ప్రమాదకరమైన డ్రైవింగ్కు సంబంధించినవే. ఆయన సతీమణి శారద పేరిట ఉన్న కారుపైనా రూ. 16,390 మేర 14 పెండింగ్ చలానాలున్నాయి. వాటిల్లో 13 అతివేగం/ప్రమాదకరమైన డ్రైవింగ్ వల్ల విధించినవే. మరో మంత్రి ఈటల పేరిట కార్లు లేకున్నా.. ఆయన భార్య జమునకు మూడు కార్లు ఉన్నాయి. వాటిపై వరసగా.. రూ. 2,475, రూ. 5,740, రూ.18,760 చొప్పున పెండింగ్ చలానాలు ఉన్నాయి. ఇందులో నాలుగింటిపై పోలీసులు 2018లో లీగల్ నోటీసులు జారీ చేశారు. ముషీరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్కు మూడు చలానాల బకాయిల విషయంలో పోలీసులు లీగల్ నోటీసులు పంపారు. ఆయన వాహనంపై రూ. 3,115 మేర మొత్తం 9 చలానాలు ఉన్నాయి.
మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డికి చెందిన వాహనానికి సంబంధించిన ఏడు చలానాల్లో.. నాలుగింటికి లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ వాహనానికి 11 చలానాలు జారీ అయ్యాయి. రూ. 8,785 చెల్లించాల్సి ఉంది. 2015 అక్టోబరులో లీగల్ నోటీసులు పంపారు. కాగా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన పేరిట టీఎస్31-0009, టీఎస్06ఈబీ-9999, టీఎస్32బీ-0009 నంబర్లతో మూడు కార్లు, తన సతీమణి పేరిట టీఎస్06ఈఎఫ్-8055 నంబరుతో ఒక కారు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆయన సతీమణి పేరిట ఉన్న కారుకు జారీ అయిన చలానాలను పరిశీలించగా ఆమె కారు నంబరును ఒక యువకుడు తన బైక్పై వేయించుకున్నాడు. దానిపై 6 చలానాలు జారీ అయ్యాయి.
