Published: 30-04-2019
బాధితురాలి సోదరిపై సర్కిల్ ఇన్స్పెక్టర్ కన్ను

.ఇవీ న్యాయం చేయాల్సిందిగా పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఒక యువతితో సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడిన మాటలు. న్యాయం కోసం స్టేషన్కు వచ్చిన మహిళ పట్ల గౌరవంగా వ్యవహరించాల్సిన సర్కిల్ ఇన్స్పెక్టర్ తన బాధ్యతలను విస్మరించి కామంతో కళ్లు మూసుకుపోయి కీచకుడిలా ప్రవర్తించాడు. ఆ యువతికి ఫోన్ చేసి తన వశం చేసుకునేందుకు యత్నించాడు. సుమారు 30 నిమిషాలపాటు అసభ్యంగా మాట్లాడాడు. సీఐ ప్రవర్తనతో విస్మయానికి గురైన ఆ యువతి కాల్ రికార్డు చేసి మహిళా సంఘాలతో కలిసి సోమవారం ద్వారకా ఏసీపీ వైవీ నాయుడుకు ఫిర్యాదు చేసింది. ఆయన విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ మహేష్చంద్ర లడ్డా దృష్టికి తీసుకువెళ్లడంతో బాధ్యుడైన ఎంవీపీ స్టేషన్ సీఐ సన్యాసినాయుడుపై సస్పెన్షన్ వేటు వేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం లక్ష్మీపురానికి చెందిన పల్లా కృష్ణకుమారి ఏయూలో పీహెచ్డీ చేస్తూ ఎంవీపీ కాలనీలో తన కుటుంబంతో కలిసి ఉంటోంది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మేనమామ టి.విజయ్భాస్కర్తో ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నాడు. ఇప్పుడు వేరొక యువతితో పెళ్లికి నిశ్చితార్థం చేసుకున్నాడు. దీనిపై కృష్ణకుమారి ఈనెల 27న ఎంవీపీ పోలీ్స స్టేషన్లో ఫిర్యాదుచేసింది. ఈ సందర్భంగా కృష్ణవేణితోపాటు సీఏ చదువుతున్న ఆమె చెల్లి కూడా స్టేషన్కు వెళ్లింది. ఆమెపై సీఐ సన్యాసినాయుడు కన్నేశాడు. ఆ యువతికి ఫోన్ చేసిన సీఐ సన్యాసినాయుడు....ఆమె సోదరికి న్యాయం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేశానని, తన సామాజిక వర్గమేనన్న అభిమానంతో ఏదో చేద్దామనుకున్నా చేయలేకపోయానంటూ నిట్టూర్చాడు. అనంతరం అసభ్యకరమైన పదజాలంతో మాటలు కొనసాగించాడు. ఎక్కడ వుంటున్నారని ప్రశ్నించగా ఎంవీపీ సెక్టార్-9లో అని చెప్పగానే తన లిమిట్స్లోనే వుంటున్నావంటూ ఏకవచనంతో సంబోధించడం మొదలెట్టాడు. ‘మీ అక్క కంటే నువ్వు చాలా అందంగా వున్నావని పొగడ్తలు కురిపించాడు. నువ్వు హైదరాబాద్ వెళ్లిపోతే మాకు కనిపించవన్నమాట అంటూ తన మనసులోని ఉద్దేశాన్ని క్రమంగా బయటపెట్టాడు.
ఖాళీ చూసుకుని తనతో బయటకు రావాలని ప్రతిపాదించడంతో ఆమె అవాక్కయింది. ఎందుకు అలా అంటున్నారని ప్రశ్నించగా...‘నీకు ఇంకా అర్థం కాలేదా...నీతో మాట్లాడాలని...కలవాలని...ప్రేమ సాగించాలని ఉందంటూ’ తనలోని మృగత్వాన్ని బయటపెట్టాడు. ‘మా నాన్నకు ఆరోగ్యం బాగోలేక మూడు నెలలు ఆస్పత్రిలో వుంటే తిండి లేకపోయినా ఎవరి వద్దా చేయిచాచకుండా వచ్చాం...మీకూ ఆడపిల్లలు ఉన్నారు కదా...ఆడపిల్లలంటే మీకు అంత అలుసా...’ అంటూ ఆమె కన్నీటి పర్యంతమైంది. తండ్రి లేడు, ఇద్దరూ ఆడపిల్లలే..చదువుకుంటున్నారు. డబ్బులు అవసరం ఉంటాయి...బయటకు వస్తావా అంటు సీఐ ఫోన్లో వేధించారని ఆమె వాపోయింది.
