Published: 10-04-2019
వైసీపీ ఎంపీ అభ్యర్థిపై పార్టీ కార్యకర్తల ఆగ్రహం

ఎస్సీలనే కించపరుస్తారా అంటూ వైసీపీలోని ఎస్సీ కార్యకర్తలు విశాఖలో మెరుపు ఆందోళనకు దిగారు. ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకు వ్యతిరేకంగా మంగళవారం ఆయన కార్యాలయం ఎదుటే నినాదాలతో హోరెత్తించారు. ఎస్సీలను అవమానించిన అభ్యర్థికి తమ సత్తా ఏమిటో 11న చూపిస్తామని హెచ్చరించారు. అదే సమయంలో పార్టీ కార్యాలయంలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతుండటంతో గందరగోళానికి దారతీసింది. ఈ వివాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 4న ఎస్సీలతో భారీ సమావేశం నిర్వహించాలని ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ భావించారు. 2వేల మంది ఎస్సీలను కార్యాలయానికి తీసుకురావాలని పార్టీ నేతలకు సూచించారు. ఆ రోజు అనుకున్న సమయానికి సమావేశం మొదలుకాలేదు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఎంవీవీ వచ్చారు. ‘తక్కువ మంది వచ్చారేమిటి?’ అంటూ ఎస్సీ నాయకులపై చిర్రుబుర్రులాడుతూ వెళ్లిపోయారు.
సమావేశం ఏర్పాట్లపై ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. దానిపై ప్రశ్నించేందుకు మంగళవారం జనాలతో కలిసి ఎంపీ అభ్యర్థి కార్యాలయానికి ఎస్సీ నాయకులు వచ్చారు. అక్కడెవరూ పట్టించుకోక పోవడంతో ‘ఎంవీవీ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. వైసీపీ విశాఖ దక్షిణ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్, విశాఖ తూర్పు అభ్యర్థి విజయనిర్మలకు వ్యతిరేకంగా కూడా నినదించారు. ఎంవీవీ అనుచరులు వారిని సముదాయించడానికి యత్నించారు. కానీ, తమ సత్తా ఏమిటో ఈ నెల11న చూపిస్తామని, ఎంవీవీకి వ్యతిరేకంగా పనిచేస్తామని కార్యకర్తలు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఒక నాయకుడు మాట్లాడుతూ.. ‘కార్యకర్తలను పట్టించుకోకుండా, కలుపుకొని వెళ్లకుండా ఎంవీవీ ఎలా గెలుస్తారు?. అధికారం రాకముందే ఇలా ఉంటే.. గెలిస్తే మా ముఖం కూడా చూడరు. అలాంటి నాయకులు మాకు అవసరం లేదు. ఈ చుట్టుపక్కలే 40 వేల మంది ఎస్సీలు ఉన్నారు. వారంతా ఎంవీవీకి వ్యతిరేకంగా పనిచేస్తారు’ అని చెప్పారు.
‘ఎస్సీల సమావేశానికి 2 వేల మందిని తీసుకురమ్మన్నారు. 4 వేల మందిని తీసుకొచ్చాం. మధ్యాహ్నం ఒంటి గంటకే అంతా వచ్చేశారు. 2 గంటలకు సమావేశం అని చెప్పిన ఎంవీవీ 3.30 గంటలకు వచ్చారు. ఆకలవుతోందని కొంత మంది మహిళలు పక్కన సమోసాలు పంపిణీ చేస్తుంటే వెళ్లారు. ఎంవీవీ అక్కడికి రాగానే.. ‘ఎస్సీలు ఈ పది మందేనా?’ అంటూ అవమానకరంగా మాట్లాడారు. మరో మాట లేకుండా వెళ్లిపోయారు. ఎంతో అభిమానంతో పార్టీని గెలిపించుకుందామని వస్తే అవమానించారు. అందుకే ఆయనకు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాం’ అని ఎస్సీ నేత గిరి తెలిపారు.
