Published: 09-04-2019
ఎవరికి వేశారో బయటకి రాదు

ఎవరికి ఓటేశారో ఓటరుకు తప్ప వేరెవ్వరికీ తెలిసే అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. కాబట్టి, ఎవరికీ భయపడకుండా నచ్చిన అభ్యర్థికి స్వేచ్ఛగా ఓటేసుకోవాలని సూచించారు. ఎవరు ఎవరికి ఓటు వేస్తున్నారో తమకు తెలుస్తుందంటూ కొన్నిచోట్ల ఓటర్లను భయపెడుతున్న ఘటనలపై సోమవారం సీఈవో స్పందించారు. ‘ఓట్ల లెక్కింపు సమయంలోనూ ఇది బయటపడదు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో నిఘా పటిష్టం చేస్తున్నాం. సైలెంట్ రిగ్గింగ్ జరిగే కేంద్రాల్లో వీడియో కెమెరాలు, వెబ్కాస్టింగ్ ఉంటుంది. అల్లర్లకు అవకాశం ఉన్నచోట సాయుధ సిబ్బంది, మైక్రోఅబ్జర్వర్లు పరిశీలిస్తారు. ఆయా పార్టీలు 30వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితా ఇచ్చాయి’ అని ఆయన అన్నారు. పోలింగ్ రోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో మాక్పోల్ నిర్వహిస్తారని, ఎన్నికల సిబ్బంది, పోలింగ్ ఏజెంట్లు కలిసి మాక్పోలింగ్లో 50 ఓట్లు వేస్తారని చెప్పారు. ‘ఈవీఎంలో ఏవైనా అవకతవకలు, రిపేర్లు ఉంటే ఆ సమయంలోనే బయటపడతాయి. ఒకవేళ అవకతవకలు గుర్తిస్తే ఈవీఎంను మార్చి మరో ఈవీఎంను పెడతాం. మాక్పోల్లో వేసిన ఓట్లను ఈవీఎం నుంచి పూర్తిగా తొలగించిన తర్వాతే అసలు పోలింగ్ ప్రారంభిస్తారు. అయితే మాక్పోల్ ఓట్లు తొలగించారో లేదో పోలింగ్ ఏజెంట్లు దగ్గరుండి చూసుకోవాలి’ అని సూచించారు. ఈవీఎంలో తలెత్తే సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్రంలో 600 మంది ఇంజనీర్లు అందుబాటులో ఉన్నారన్నారు.
ఐడీ లేదని ఆందోళన వద్దు!
ఓటరు జాబితాలో పేరుండి, ఓటర్ ఐడీ లేకపోతే ఆందోళన అక్కర్లేదని ద్వివేది చెప్పారు. ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి నిర్భయంగా ఓటేయొచ్చునని ఆయన తెలిపారు.
ఈసీ అనుమతించిన ఐడీ కార్డులు
1. పాస్పోర్టు, 2. డ్రైవింగ్ లైసెన్స్
3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలు తమ ఉద్యోగులకు జారీ చేసిన ఫొటో ఐడీ కార్డు
4. ఫొటోతో కూడిన బ్యాంకు లేదా పోస్టాఫీస్ పాస్బుక్
5. పాన్కార్డు, 6. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్) ప్రకారం జారీ చేసిన ఆర్జీఐ స్మార్ట్ కార్డు
7. ఉపాధి హామీ గుర్తింపు కార్డు
8. ఫొటో కలిగిన జీవిత బీమా స్మార్డ్ కార్డు
9. ఫొటో కలిగిన పెన్షన్ డాక్యుమెంట్
10. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు
11. ఆధార్ కార్డు ఓటరు ఐడీలో ఉన్న ఫొటోతో ఓటరు ఫొటో సరిపోలనప్పుడు కూడా వీవీటితో ఓటేయొచ్చన్నారు.
