Published: 03-04-2019

జగనన్న సీఎం అయితే సమస్యలన్నీ పరిష్కరిస్తా

 ఆంధ్రా- తమిళనాడు సరిహద్దుల్లో, ఉభయ సంస్కృతీ సంప్రదాయాలకు నెలవు నగరి నియోజకవర్గం. ఇక్కడ రాజకీయ ఓనమాలు నేర్చుకున్న ఎందరో నేతలు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగారు. ఒక దశలో కాంగ్రెస్‌, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలకు ఈ నియోజకవర్గం వారే సారథులుగా ఉండడం విశేషం. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రెడ్డివారి చెంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చిలకం రామచంద్రారెడ్డి, కమ్యూనిస్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కె.నారాయణ ఏకకాలంలో సారథ్యం వహించారు. తమిళుల సంఖ్య అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో మరమగ్గాల నిర్వాహకులైన మొదలియార్‌లు ప్రథమ స్థానంలో, ఎస్సీలు రెండో స్థానంలో ఉన్నారు.
 
తమిళపార్టీల స్ఫూర్తితో ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం కాస్త ఎక్కువే. గెలుపు మీద అతి విశ్వాసంతో ఉండేవారిని ఊహించని రీతిలో ఓడించడం ఇక్కడి ప్రత్యేకత. 1994, 2009 సంవత్సరాల్లో చెంగారెడ్డి, 1999లో వి.దొరస్వామిరాజు, 2014లో గాలి ముద్దుకృష్ణమనాయుడు ఈ కోవలో ఓడిపోయిన వారే. నియోజకవర్గ చరిత్రలో అతి తక్కువగా.. కేవలం 858 ఓట్ల తేడాతో ముద్దుకృష్ణమనాయుడు ఓడిపోవడం విశేషం. 1962లో జరిగిన తొలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా డి.గోపాలరాజు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మీద గెలవడం మరో విశేషం.