Published: 29-03-2019
వివేకాని కిరాతకంగా హింసించి చంపేశారు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి పోలీసులు తొలి అరెస్టు చేశారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి, వైఎస్ కుటుంబ సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, వంటమనిషి కుమారుడు ప్రకాశ్లను గురువారం అరెస్టు చేశారు. పులివెందుల కోర్టులో వీరిని హాజరుపరచగా ఏప్రిల్ 8 వరకు రిమాండ్ విధించారు. కాగా.. వివేకా గుండెపోటుతో చనిపోయారంటూ ఈ నెల 15న ఉదయం 9-10 గంటల దాకా జగన్కు చెందిన టీవీ చానల్లో ప్రసారమైన సంగతి తెలిసిందే. కానీ.. వివేకాది హత్యేనన్న విషయం ఆ రోజు ఉదయమే ఈ ముగ్గురికీ తెలుసని పోలీసులు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు.
అయితే, ఆ హత్యకు సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ఎర్రగంగిరెడ్డి, మూలి వెంకట కృష్ణారెడ్డి, ఎద్దుల ప్రకాశ్ ప్రయత్నించారని అందులో పేర్కొన్నారు. ‘‘ఈ కేసులో ఏ1.. తుమ్మలపల్లి గంగిరెడ్డి అనే ఎర్రగంగిరెడ్డి(58). ఇతను వ్యవసాయదారుడు. తొండూరు మండలం తుమ్మలపల్లెకు చెందిన ఈయన పులివెందులలో కాపురం ఉంటున్నాడు. ఏ2.. వెంకటకృష్ణారెడ్డి (56) పులివెందులలో ఓ స్కూలులో అసిస్టెంట్ లైబ్రేరియన్గా పనిచేస్తూ వివేకా పీఏగా వ్యవహరిస్తున్నారు. ఏ3.. ఎద్దుల ప్రకాశ్ (29) ఎంబీఏ చదివి నిరుద్యోగిగా ఉన్నాడు. ఇతను వంట మనిషి కుమారుడు. ఈ ముగ్గురూ వివేకా హత్యానేరానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేసే నేరానికి పాల్పడ్డారు. వివేకాను అత్యంత కిరాతకంగా హత్య చేసి, తర్వాత సాక్ష్యాలు చెరిపేసేందుకు ప్రయత్నించినట్టు మా దర్యాప్తులో తేలింది. ఈ నెల 14 రాత్రి 11.30 నుంచి 15వ తేదీ తెల్లవారుజామున 5.30గంటల మధ్య ఈ హత్య జరగ్గా.. 15వ తేదీ 8 గంటలకు ఏ2 వెంకటకృష్ణారెడ్డి పిర్యాదు చేశారు. ఆయన ఆరోజు ఉదయం 5.30 గంటలకు వివేకా ఇంటికి వెళ్లారు. అప్పటికి వివేకా లేవకపోవడంతో అరగంటపాటు దినపత్రిక చదివి.. వివేకా భార్య సౌభాగ్యమ్మకు ఫోన్ చేశారు. ఆయన్ను మేల్కొలపాలా వద్దా అని అడగ్గా... రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉంటారు కాబట్టి మేల్కొలపవద్దని ఆమె సూచించారు.
