Published: 17-03-2019

వివేకా హత్య కేసు..బాబుపైనే ఆరోపణలు

 వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించకపోతే ఒకట్రెండు రోజుల్లో కోర్టును ఆశ్రయిస్తామని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తెలిపారు. సీబీఐతో విచారణ జరిపిస్తేనే ఈ కేసులో న్యాయం జరుగుతుందన్నారు. టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబుకు రిపోర్టు చేసే పోలీసు అధికారులతో విచారణ జరిపిస్తే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. వివేకా హత్య కేసు విషయంలో చంద్రబాబు తీరు... దొంగే.. దొంగా దొంగా అని అరిచిన చందంగా ఉందన్నారు. ‘వివేకా హత్య విషయమై నేను కడప ఎస్పీతో మాట్లాడుతుండగానే ఆయనకు అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వర్‌రావు ఫోన్‌ చేశారు. ఈ కేసులో ఆయన ఎంత లోతుగా చొరవ చూపుతున్నారో దీన్నిబట్టే తెలుస్తోంది. నిఘా వ్యవస్థను చంద్రబాబుకు వాచ్‌మన్‌లాగా ఆయన వాడుతున్నారు.
 
వైసీపీ నేతలు ధర్మాన ప్రసాదరావు, మిథున్‌రెడ్డి తదితరులతో కలిసి శనివారమిక్కడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో జగన్‌ సమావేశమయ్యారు. వివేకా హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించేలా చొరవ చూపాలని కోరారు. అనంతరం జగన్‌ విలేకరులతో మాట్లాడారు. ‘మా చిన్నాన్న ఎలా చనిపోయారు? మీ ప్రమేయం లేకపోతే కేసు విచారణను సీబీఐకి ఎందుకివ్వడంలేదు? ఈ విషయమై ఎందుకు సమాధానం చెప్పడంలేదు’ అని చంద్రబాబును ప్రశ్నించారు. రాక్షసత్వం ఒక స్థాయి దాటితే దేవుడే చూస్తాడని అన్నారు. కడప జిల్లా ఎస్పీని కూడా కావాలనే మార్చారని ఆరోపించారు. ‘వివేకాను డ్రైవరే కొట్టి చంపాడంటూ ఆయనే రాశారని ఒక లేఖను సృష్టించారు. ఆయన్ను దెబ్బలు కొడుతుంటే లేఖ ఎలా రాశారు? చంపుతున్నవాళ్ల ముందే రాస్తారా? వివేకా రక్తం కక్కుకున్నట్టుగా, బాత్రూంలో కమోడ్‌కి తల తగిలి రక్తం వచ్చినట్టు నమ్మించేందుకు రక్తాన్ని కమోడ్‌కు పూశారు. ఇదంతా కుట్ర అని తెలియడం లేదా? వివేకా మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా పనిచేశారు.