Published: 02-03-2019
మీడియా ప్రశ్నలపై సైనిక ప్రతినిధులు

బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై జరిపిన వైమానిక దాడిలో చనిపోయిన ఉగ్రవాదులు ఎందరు? 350 మందికిపైగా అని అధికారులు చెబుతున్నా దానికి తగ్గ ఆధారాలు మాత్రం ఇవ్వలేకపోతున్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన త్రివిధ దళాల ప్రతినిధులు ముగ్గురు కూడా ఈ ప్రశ్నకు సంతృప్తికర సమాధానం ఇవ్వలేదు. బాలాకోట్ శిబిరంలో చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్య ఎంతో చెప్పగలరా? అని విలేకరులు ప్రశ్నిస్తే.. ‘ఆ వివరాలు ఇప్పుడు వెల్లడించడం తొందరపాటే అవుతుంది’ అంటూ ఎయిర్ వైస్ మార్షల్ కపూర్ దాటవేశారు. దేశంలో సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులు జరుపుతోందన్న విషయాన్ని ఆయనతో పాటు మేజర్ జనరల్ సురీందర్సింగ్ మహల్, రేర్అడ్మిరల్ దల్బీర్సింగ్ గుజ్రాల్ ఈ సమావేశంలో తెలిపారు. నియంత్రణరేఖ వద్ద పాక్ను తరిమికొడుతూ ఆ దేశానికి చెందిన విమానాన్ని కూల్చేశామనీ చెప్పారు. కానీ దానికీ తగిన ఆధారాలను వెల్లడించలేకపోయారు.
మరో వైపు భారత్ వైమానిక దళం మిరాజ్ విమానాలతో వేసిన బాంబుల వల్ల పాక్ అడవిలో ఉన్న చెట్లు కూలిపోయాయని దీంతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరిగిందని పాకిస్థాన్ మంత్రి మాలిక్ అమిన్ అస్లాం ఆరోపించిన విషయం తెలిసిందే.
