Published: 25-02-2019
పోలవరం వద్ద వందమీటర్ల మేర పగుళ్లు

పోలవరం నుంచి ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రోడ్డు మరోసారి 100 మీటర్ల మేర పగుళ్లిచ్చింది. ఆదివారం ఉదయం జరిగిన ఘటనతో స్థానికులు, సందర్శకులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. గతంలోనూ పోలవరం గ్రామ సమీపంలో ఇదే విధంగా పగుళ్లివ్వడం తెలిసిందే. తాజా ఘటన సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను సైతం అధికారులు నిలిపివేశారు. ఉదయానే ఏజెన్సీ గ్రామాలకు వెళ్లిన ఆర్టీసీ బస్సు ఉదయం ఎనిమిది గంటలకు వెనక్కి వచ్చే సమయంలో రోడ్డు పగుళ్లిచ్చింది. దీంతో గోదావరి ఒడ్డున స్పిల్చానల్ నుంచి బస్సును పోనిచ్చారు.
తరువాత మిగిలిన సర్వీసులు నిలిపివేశారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలను మాత్రం అనుమతించారు. ఆదివారం 329 బస్సుల్లో 15,638 మంది సందర్శకులు పోలవరం ప్రాజెక్టును చూసేందుకు వచ్చారు. నవయుగ భోజనశాలకు సందర్శకుల బస్సులను రానివ్వకుండా మొదటి చెక్పోస్టు నుంచి స్పిల్ చానల్కు మళ్లించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పగుళ్లు నెమ్మదిగా పెరుగుతూనే ఉన్నాయి. మరోపక్క వాటిని సరి చేస్తూనే ఉన్నారు. సోమవారం మరికొంత ప్రాంతానికి పగుళ్లు విస్తరించే అవకాశం ఉంది. పగుళ్లిచ్చిన రోడ్డు..స్పిల్ చానల్ మట్టి పనులు చేస్తున్న ప్రాంతానికి అతి సమీపంలో ఉందని పోలవరం ప్రాజెక్టు సలహాదారుడు వీఎస్ రమేశ్బాబు చెప్పారు. ఆ రోడ్డు 20 మీటర్ల ఎత్తులో ఉండడంతో నల్లమట్టి కిందకి దిగి పగుళ్లు వచ్చాయన్నారు. స్పిల్ చానల్ పొడవునా లూజ్ సాయిల్ (మెతకనేల) ఉన్న ప్రాంతా ల్లో ఇలా జరిగే అవకాశం ఉందన్నారు. స్పిల్ చానల్ వెంబడి సపోర్ట్గా నిర్మాణం చేపట్టాల్సి ఉందని, ఆ డిజైన్లు పీడబ్ల్యూసీ వద్ద ఉన్నాయని, ఫైనల్ కావాల్సి ఉందని తెలిపారు.
స్పిల్ చానల్ పొడవునా మట్టి జారకుండా డయా ఫ్రం వాల్ కట్టడానికి కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతిపాదనలు చేసిందన్నారు. సీడబ్ల్యూసీ మాత్రం దీన్ని మట్టితోనే గట్టిపరచాలని చెప్పిందన్నారు. అయి తే, అందుకు అనుకూలమైన మట్టి ఇక్కడ అందుబాటులో లేదన్నారు. దీంతో ప్రొఫెసర్ రమణ, సైంటిస్టులతో మరోసారి ఆ ప్రాంతం మొత్తం పరిశీలన చేయాలని సీడబ్ల్యూసీ ఆదేశించిందన్నారు. ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయని తెలిపారు. స్పిల్ చానల్ పొడవునా రిటైనింగ్ వాల్ కట్టాల్సి వస్తుందన్నారు.
