Published: 01-02-2019
జగన్కు చెప్పిన కోడికత్తి నిందితుడు

వైసీపీ అధ్యక్షుడు జగన్పై కోడికత్తి దాడి కేసులో సిట్ రిమాండ్ రిపోర్ట్లోని అంశాలనే దాదాపుగా ఎన్ఐఏ తన చార్జిషీట్లో ప్రస్తావించింది. కోడికత్తితో నిందితుడు శ్రీనివాసరావు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశాడని తేల్చింది. ‘సార్, మీరు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 160 సీట్లు గెలుస్తారు’ అని జగన్తోనిందితుడు అన్నట్లు అందులో స్పష్టంగా పేర్కొంది. ఇటీవల విజయవాడ ఎన్ఐఏ కోర్టులో దాఖలు చేసిన ఆ చార్జిషీట్ను ‘ఆంధ్రజ్యోతి’ సంపాదించింది.
గత ఏడాది అక్టోబరు 25న విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్పై కోడికత్తితో జానిపల్లి శ్రీనివాసరావు అలియాస్ చంటి దాడిచేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. 10వేల ఫోన్కాల్స్ను విశ్లేషించిన సిట్ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసి, పలువురిని ప్రశ్నించి నిజాల నిగ్గు తేల్చింది. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు జగన్ అభిమాని అని, జగన్ ముఖ్యమంత్రి కావాలంటే ఆయనకు సానుభూతి రావాలన్న ఉద్దేశంతో ప్రణాళిక ప్రకారం దాడి చేశాడని నిర్ధారించింది. 2018 జనవరిలోనే కోడికత్తిని తీసుకున్నట్లు పేర్కొంది. పాదయాత్ర విరామంలో జగన్ ప్రతివారం హైదరాబాద్ సీబీఐ కోర్టుకు వెళ్లే క్రమంలో విమానాశ్రయానికి వస్తారని తెలిసి అక్కడి క్యాంటీన్లో పనికి చేరాడని తేల్చింది.
తేలింది ‘ఇంతే’!
రాజకీయంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైన ఈ కేసులో నిజాలు బయటపడాలంటే జాతీయ దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని వైసీపీ డిమాండ్ చేసింది. రాష్ట్రప్రభుత్వం అంగీకరించకపోయినా కేంద్రం ఎన్ఐఏకి ఈ కేసును అప్పగించింది. ఎన్ఐఏ అధికారులు సైతం సిట్ అధికారులు తేల్చిన విషయాలనే దాదాపుగా తమ చార్జిషీటులో ప్రస్తావించారు. కోడికత్తి దాడిలో ఇతర వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అభియోగ పత్రంలో పేర్కొనలేదు. శ్రీనివాసరావుపై తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో ఉన్న కేసును తెలుసుకోకుండా విమానాశ్రయ సెక్యూరిటీ పాస్ జారీ చేయడాన్ని తప్పుబట్టింది. సిట్ తేల్చిన అంశాలనే తమ చార్జిషీట్లో పొందుపరిచిన ఎన్ఐఏ ఒకటి రెండు అదనపు క్లాజులు చేర్చడం మినహా ఇంకేమీ ప్రస్తావించలేదు. తమ దర్యాప్తులో ‘ఇంతే’ తేలిందని, ఇదే ప్రధాన అభియోగ పత్రమని ఎన్ఐఏ పేర్కొంది. తదుపరి దర్యాప్తులో కొత్తవిషయాలు వెలుగులోకి వస్తే మరో చార్జిషీట్ వేస్తామని తెలియజేసింది.
- ముందస్తు ప్రణాళిక ప్రకారం 2018 అక్టోబరు 25న మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో విశాఖ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్లోకి నిందితుడు శ్రీనివాసరావు ప్రవేశించి జగన్పై కోడికత్తితో దాడి చేశాడు. జగన్ను హతమార్చాలన్న ఉద్దేశంతో మెడపై కత్తితో దాడి చేయబోగా అది ఆయన ఎడమ భుజంలోకి దిగింది.
- ఐసీపీ సెక్షన్ 307 కింద నిందితుడు నేరానికి పాల్పడ్డాడు. 1934లోని ఎయిర్క్రాఫ్ట్ చట్టం సెక్షన్ 2(2)ను ఉల్లంఘించి జగన్పై దాడిచేసి గాయపర్చడంతోపాటు ఎయిర్పోర్టు భద్రతకు ముప్పు తీసుకొచ్చారు. 1982 పౌరవిమానయాన భద్రత చట్టంలోని సెక్షన్ 3ఏ(1)(ఏ)ను ఉల్లంఘించాడు.
