Published: 23-01-2019
ఇటు సస్పెన్షన్... అటు జగన్తో చర్చలు

రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డిని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు సస్పెండ్ చేసిన మూడు గంటల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని మేడా కలిసి చర్చలు జరిపారు. నాలుగున్నరేళ్ల టీడీపీ కాపురంలో మేడాది నిత్యం కలహాలతో గడిచింది. వైఎస్ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యంగా మెలిగే మేడా కుటుంబం అనూహ్య రీతిలో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందినా మనసు ఒక చోట.. అన్నట్లుగానే నడిచింది. పది రోజులుగా జిల్లా రాజకీయాల్లో మేడా వ్యవహారం హాట్టాపిక్గా మారినా మంగళవారం పలు మలుపులతో మేడా వివాదానికి శుభం కార్డు వేశారు. ఈనెల 31న జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నానని, ఉదయమే పార్టీకి, విప్కు రాజీనామా పంపాను. బుధవారం స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా సమర్పిస్తామని మేడా తెలిపారు.
మేడా కుటుంబం మొదటి నుంచి కాంట్రాక్టు పనులు చేసేవారు. నాటి వైఎస్ రాజశేఖర్రెడ్డి కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యంగా మేడా కుటుంబం వ్యవహరించేది. ఈ నేపధ్యంలో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆకేపాటి అమరనాథరెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఆ తరువాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య రీతిలో టీడీపీ టికెట్ దక్కించుకుని పోటీ చేశారు. అప్పటికే బీజేపీ పొత్తులతో రాజంపేట అసెంబ్లీని బీజేపీకి కేటాయించినా చివరి నిమిషంలో జిల్లా నేతలు ఒత్తిడి తెచ్చి టీడీపీ పోటీ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. కడప అసెంబ్లీని ఆ ఎన్నికలలో పొత్తుల కింద కేటాయించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మేడా ఒక్కరే గెలుపొందారు. జిల్లా నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే కావడంతో మంత్రి పదవి వస్తుందని మేడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ సీఎం చంద్రబాబు మంత్రి ఛాన్స్ మేడాకు ఇవ్వలేదు. ఆనాటి నుంచి అసంతృప్తితోనే కొనసాగుతుండగా ప్రభుత్వ విప్ పదవిని కట్టబెట్టారు. అలా అలా మూడున్నరేళ్ల పాటు టీడీపీలో కొనసాగిన మేడా తిరిగి వైసీపీలో చేరుతారని ప్రచారం సాగుతూ వచ్చింది. ఆయన సోదరుడు మేడా రఘునాథరెడ్డి జగన్తో టచ్లో ఉంటారని, అందుకనే ఈసారి రాజంపేట అసెంబ్లీ వైసీపీ టికెట్ రఘునాథరెడ్డికి ఇస్తారన్నది వైసీపీ నేతలే చర్చించుకుంటూ వచ్చారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలోని వైసీపీ అభ్యర్థులకు రఘునాథరెడ్డి ఆర్థిక వనరులు సమకూరుస్తారని, అందుకనే ఆయనకు అసెంబ్లీ సీటు ఇస్తారని తొలి నుంచి జిల్లా రాజకీయాల్లో వినిపిస్తూ వచ్చింది.
ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏదో ఒకటి తేల్చుకోవాలని మేడా నిర్ణయించుకుని సీఎం పిలిచినా వెళ్లలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గత ఒకటిన్నర ఏడాదిగా మేడా వైసీపీలో చేరుతారని మీడియాలో విస్తృత ప్రచారం సాగుతూ వచ్చింది. అసంతృప్తిగా ఉన్న మేడాను ఆయన సోదరుడు రఘునాథరెడ్డిని పిలిచి సీఎం చర్చించి మంచి భవిష్యత్తు ఇస్తాం. పార్టీని వీడొద్దని కోరుతూ టీటీడీ మెంబరును రఘునాథరెడ్డికి ఆఫర్ చేయగా, ఆయన మా తండ్రి రామకృష్ణారెడ్డికి ఇవ్వాలని సూచన చేశారు. దీంతో రామకృష్ణారెడ్డికి టీటీడీ మెంబరు పదవిని కట్టబెట్టారు. నియోజకవర్గంలో మేడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నియోజకవర్గంలోని టీడీపీ నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తూ రాగా మహిళా నేత పత్తిపాటి కుసుమకుమారి ఎమ్మెల్యే మేడాపై తిరుగుబాటు చేసి విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఇలా నిత్యం ఏదోక వివాదం రాజంపేట నియోజకవర్గంలో నేతల మధ్య సాగుతూ వస్తుండగా ఆదివారం రాజంపేటకు వెళ్లిన మంత్రి ఆది, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిలను మేడా వర్గీయులు అడ్డుకోవడం, ఈ వివాదం తీవ్రమైంది. చివరికి మంగళవారం సీఎం చంద్రబాబు రాజంపేట నేతలతో మాట్లాడి మేడాను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో టీడీపీలో నెలకొన్న మేడా వివాదం కథ సుఖాంతమైంది.
