Published: 19-01-2019
కోడికత్తిపై సర్కారు పిటిషన్

కోడికత్తి కేసు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. వారం రోజులపాటు అతడ్ని హైదరాబాద్లో విచారించిన ఎన్ఐఏ అధికారులు శుక్రవారం విజయవాడలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిని మరో 3 రోజులు కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేస్తుందని ప్రచారం జరిగింది. ఎన్ఐఏ మాత్రం ఎలాంటి పిటిషన్ను దాఖలు చేయలేదు. నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీమ్ మూడు పిటిషన్లను దాఖలు చేశారు. విజయవాడలోని జిల్లా జైలులో శ్రీనివాసరావుకు భద్రత లేదని, రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలుకు తరలించాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి పార్థసారధి నిందితుడిని ప్రశ్నించగా.. తనకెలాంటి ప్రమాదం లేదని బదులిచ్చాడు. అనంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు విన్నారు.
విజయవాడ జిల్లా జైలులో భద్రతను పెంచలేమని ఆయన స్పష్టం చేయడంతో.. నిందితుడిని రాజమహేంద్రిలోని సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 25వ తేదీ వరకు రిమాండ్ను పొడిగించారు. విశాఖ జైలులో ఉండగా నిందితుడు రాసుకున్న 20 పేజీల లేఖను, జైలు అధికారులు లాక్కున్నారని, ఆ లేఖను ఇప్పించాలని దాఖలైన మరో పిటిషన్పై వాదనలు వినిపించారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో తదుపరి విచారణను ఈనెల 23వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అలాగే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉండగా.. తాను తప్ప ఇతర న్యాయవాదులెవ్వరూ నిందితుడిని కలవకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది సలీమ్ మరో పిటిషన్ వేశారు.
కాగా, కోర్టు ఆదేశాలతో ఏఆర్ పోలీసుల భద్రత మధ్య నిందితుడు శ్రీనివాసరావును శుక్రవారం సాయంత్రం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు ఎన్ఐఏ ఎస్పీ షాజిత్ మహమ్మద్ నేతృత్వంలో అధికారులు తీసుకొచ్చారు. విశాఖ సిట్ పోలీసులు కేసు రికార్డులను ఎన్ఐఏకి అప్పగించాలని న్యాయమూర్తి పార్థసారథి ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ఎన్ఐఏ అధికారుల బృందం నిందితుడు శ్రీనివాసరావు స్వగ్రామమైన ఠాణేలంకలో శుక్రవారం విచారణ నిర్వహించింది.
