Published: 05-01-2019

అవసరానికి మించి ఉన్నాయ్‌

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో రూ.రెండు వేల నోట్లు తగిన స్థాయిలో ఉన్నందున ప్రస్తుతానికి వాటి ముద్రణను నిలిపివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ శుక్రవారం ఈ మేరకు ట్వీట్‌ చేశారు. రూ.2000 నోట్లను క్రమంగా చలామణి నుంచి తీసేస్తారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు వివరణ ఇచ్చింది. భవిష్యత్తు అవసరాలను అంచనా వేసి కరెన్సీ నోట్ల ముద్రణకు ప్రణాళిక రచిస్తామని గార్గ్‌ చెప్పారు. ‘‘మన వ్యవస్థలో అవసరమైన దానికన్నా ఎక్కువ మొత్తంలో రెండు వేల నోట్లు ఉన్నాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో విలువపరంగా చూస్తే....35 శాతానికి పైగా వాటా రెండు వేల నోట్లదే. రెండు వేల నోట్ల ముద్రణ విషయంలో ఇటీవల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. నల్లధనాన్ని అరికట్టే లక్ష్యంతో 2016 నవంబరులో ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత కొత్తగా రెండు వేల నోట్లను తీసుకువచ్చింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో మన ఆర్థిక వ్యవస్థలో దాదాపు 86 శాతం వాటా వెయ్యి, 500 నోట్లదే.