Published: 04-01-2019
డిపాజిట్దారుల్లో టెన్షన్.. ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో కేసులు

లక్ష డిపాజిట్ చేస్తే నెలకు రూ.3వేల వడ్డీ! ఈ ప్రకటన జనాలను ఇట్టే ఆకర్షించింది. అన్ని ఆర్థిక మోసాల మాదిరే ఈ స్కీమ్లోని డిపాజిట్దార్లు బాధితులుగా మారిపోయారు. హీరా గోల్డ్లో వెలుగుచూసిన ఈ గోల్మాల్ ఇప్పుడు వేల మందిని టెన్షన్ పెట్టిస్తోంది. ఆ సంస్థ అధినేత్రి షేక్ నౌహీరాపై ఏపీతోపాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో కేసులు నమోదు కావడంతో కంగారు పడుతున్నారు. హీరా గోల్డ్.. మరో అగ్రిగోల్డ్ అవుతుందా అని ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు జిల్లా కలకడకు చెందిన నౌహీరా కొన్నేళ్ల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లి అక్కడ కొందరితో పరిచయం పెంచుకుని ‘నౌహీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట 10 నుంచి 14 కంపెనీలను ఏర్పాటు చేసింది. తమ కంపెనీల్లో నగదు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపడటంతో పేద, మధ్యతరగతివారు మొగ్గు చూపారు. చిత్తూరు జిల్లాలోనే దాదాపు రూ.వెయ్యి కోట్ల దాకా ఆ సంస్థలో డిపాజిట్లు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.
షేక్ నౌహీరా అక్టోబరులో అరెస్టు కావడానికి 3నెలల ముందు నుంచి డిపాజిటర్ల ఖాతాల్లో డబ్బు జమ కావడం నిలిచిపోయింది. కలకడలో ఇద్దరు డిపాజిటర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హీరా గోల్డ్ సంస్థపై రెండు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. వాటిని సీఐడీకి బదిలీ చేశారు. ఆ తరువాత ఆమెను హైదరాబాదు పోలీసులు అరెస్టు చేయడం, అక్కడ బెయిలు లభించిన వెంటనే ముంబై పోలీసులు తీసుకెళ్లడం చకచకా జరిగిపోయాయి. అయితే తాను రాజకీయాల్లోకి రావడం ఇష్టంలేని వారే విషప్రచారం చేస్తున్నారని, డిపాజిట్దారులకు అన్యాయం జరగబోదని నౌహీరా చెబుతున్నారు. ముంబై బైకుల్లా జైలులో ఉన్న ఆమెను పీటీ వారెంట్పై తీసుకొచ్చి గురువారం ఇక్కడి కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు చిత్తూరు కోర్టు ఈనెల 10వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
