Published: 28-12-2018

జేసీ దివాకర్‌రెడ్డితో 'తాడోపేడో '

ఆ అధికారి రూటే సపరేటు! ఈ మధ్యనే ఒక నేతపై మీసం మెలేసిన ఆ అధికారి వ్యవహారం అనంతపురం జిల్లాలో సంచలనం రేపింది. ఈ పంచాయితీ హైకోర్టు వరకూ చేరింది. ఇంతకీ ఏమిటా సంగతి? పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే‍‍!
 
 
   ఆయన పేరు గోరంట్ల మాధవ్. పోలీస్‌శాఖలో సీఐ. ఆ శాఖలో విధుల్లో చేరినప్పటినుంచి ఈయనదో స్టయిల్. అధికారాన్ని అడ్డంపెట్టుకొని పెత్తనం చలాయించే రాజకీయ నేతలను సైతం కౌన్సెలింగ్ పేరుతో గట్టిగానే షాక్‌లు ఇస్తారు. మాధవ్‌ వ్యవహారం నచ్చని నేతలు పలు సందర్భాల్లో ఉన్నతాధికారులపై వత్తిడి తెచ్చి వీఆర్‌కు పంపిన ఘటనలున్నాయి. ఈ మధ్యనే తాడిపత్రిలో ప్రబోధానంద స్వామి ఆశ్రమం వద్ద గొడవలు జరిగిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో పోలీసులను ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దూషించారు. దీంతో మాధవ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. పోలీసు అధికారుల సంఘం కార్యదర్శిగా ఉన్న మాధవ్ "తమ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడితే నాలుక కోస్తాను'' అని నేతలను హెచ్చరిస్తూ మీసం మెలేశారు.
 
 
     మాధవ్‌ తీరుపై జేసీ స్పందించారు. "ఒక సీనియర్‌ పొలిటీషియన్‌, పైగా ఎంపీ అయిన తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మాధవ్‌పై చర్యలు తీసుకోవాలి'' అని తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే కేసు నమోదుకు పోలీసులు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఎంపీ దివాకర్‌రెడ్డి పిటిషన్ దాఖలుచేశారు. పార్లమెంట్‌కు కూడా ఫిర్యాదుచేశారు. ఈ అంశంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. మాధవ్ చర్యలను పోలీసు ఉన్నతాధికారులు బహిరంగంగా మద్దతు పలకకపోయినా, పరోక్షంగా మాత్రం ఆయనను సమర్ధిస్తున్నారట. "మా ఆత్మాభిమానం దెబ్బతినేలా రాజకీయ నాయకులు వ్యవహరిస్తే ఎలా?'' అని వారు ప్రశ్నిస్తున్నారట.
 
 
   ఇదిలా ఉంటే, హైకోర్టుకు వెళ్లినప్పుడు మాధవ్‌కు అక్కడి న్యాయవాదులు మొదలు కొందరు ప్రజాప్రతినిధులు కూడా మద్దతు పలికారట! ఎంపీ జేసీ వంటి సీనియర్ నాయకుడు నిగ్రహం కోల్పోయి ప్రభుత్వంపైన, పోలీసు యంత్రాంగంపైన దురుసుగా మాట్లాడటం తగదని సూచించినట్లు సమాచారం. ఢిల్లీలో పార్లమెంట్ కమిటీ ముందు హాజరవడానికి మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్‌ సహా పలువురు న్యాయవాదులు సిద్ధపడుతున్నట్టు సమాచారం. మరోవైపు మాధవ్‌ వ్యవహారంపై 20 రోజుల్లోగా తమ అభిప్రాయం చెప్పమని పోలీసు ఉన్నతాధికారులను హైకోర్టు ఆదేశించింది. మాధవ్ కూడా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై వ్యక్తిగతంగా కేసు వేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. పోలీసుల పట్ల పలు సందర్భాల్లో జేసీ దురుసుగా మాట్లాడిన ప్రతి అంశాన్ని కోర్టుకు మాధవ్ సమర్పించబోతున్నారట. వీరిద్దరి గొడవ జిల్లా రాజకీయవర్గాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. చూద్దాం ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో!