Published: 26-12-2018
చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్..

బతికున్న కోడిని తాడుతో గాల్లో వేలాడదీసి, దానిని చూస్తూ, ఓ పిసినారి ఒట్టి అన్నాన్ని తింటుంటాడు.. ఓ సినిమాలోని ఈ సరదా సన్నివేశాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు అప్పట్లో.. ఇప్పుడు పెరుగుతున్న చికెన్ ధరలను చూసి సామాన్యుడు ఆ దృశ్యాన్నే గుర్తుకు తెచ్చుకుంటున్నాడు బాధగా. నెల తేడాతో రూ.60 పెరిగిన చికెన్ ధరలు మాంసాహార ప్రియులను నిరాశకు గురిచేస్తున్నాయి. ప్రతి ఏటా కార్తీక మాసంలో ధరలు తగ్గడం, అనంతరం పెరగడం సర్వసాధారణమే అయినా, ఈ ఏడాది కార్తీక మాసంలో ధరలు పెద్దగా తగ్గకపోగా.. ఆ తరువాత మునుపెన్నడూ లేనంతగా ధరలు చుక్కలను తాకడం అటు చికెన్ దుకాణదారులతో పాటు హోల్సేల్ వ్యాపారులను కూడా ఆందోళన కలిగిస్తోంది.
పండుగతో సంబంధం లేకుండానే..
సంక్రాంతి, దీపావళి, రంజాన్, క్రిస్మస్ వంటి పండుగల సమయాల్లో చికెన్తో పాటు లైవ్ బర్డ్ ధరలూ సాధారణంగా పెరుగుతుంటాయి. కొందరు ఫౌల్ర్డీ ఫామ్స్ అధినేతలు సిండికేట్గా మారి కోళ్ల ధరలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పండుగలకు ముందు కోళ్ల సరఫరాను తగ్గిస్తూ.. అమాంతంగా ధరలు పెంచి కోళ్లను సరఫరా చేస్తారు. వ్యాపారాన్ని కోల్పోవడం ఇష్టంలేని వ్యాపారస్తులు పోటీపడి మరీ కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే వ్యాపారంలో కనిపిస్తున్న పోటీతత్వం కొనుగోలుదారుడి వద్ద ఢీలా పడుతోంది. ధరలు పెరిగిన ప్రతీసారి చికెన్కు దూరమవుతున్న సామాన్యుడు రైతుబజార్ల వైపే మొగ్గు చూపుతున్నారు.
సాధారణ రోజుల్లో రోజుకు 40-50 కోళ్లను (షాపుల్లో) అమ్మే వారు 10-20కే పరిమితమవుతుండగా.. రోజుకు 2వేలకు పైగా విక్రయించే కోళ్ల (హోల్సేల్) వ్యాపారులు 1000-1100 కిలోలతో సరిపెట్టుకుంటున్నారు. తప్పనిసరి అనుకునే మాంసాహార ప్రియులు మినహా తక్కినవాళ్లు పండుగ వేళలో అరకొర కొనుగోళ్లతో మిన్నకుంటున్నారు. ధరల హెచ్చు తగ్గులతో సంబంధంలేని రెస్టారెంట్లు, హోటళ్లలో సాధారణ ధరలకే బిర్యానీలు, చికెన్ ఐటమ్స్ లభిస్తుండగా.. సామాన్యుడు అటువైపే అడుగు వేస్తున్నాడు.
