Published: 24-12-2018

వర్మను తరిమి కొడతారు’

గుంటూరు: సీఎం చంద్రబాబును కించపరిచేలా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ విడుదల చేసిన పాటను, అదేవిధంగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాలో ఆయా సన్నివేశాలను తక్షణం తొలగించకుంటే వర్మను రాష్ట్ర ప్రజలు తరిమి తరిమి కొడతారని టీడీపీ జిల్లా కార్యదర్శి వీరవల్లి మురళి ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. కేవలం పబ్లిసిటీ కోసం ప్రతిపక్షాలకు అమ్ముడుపోయి బాధ్యత గల సీఎంను అవమానించేలా, వ్యంగ్యంగా సినిమాలో సన్నివేశాలను, పాటలను రూపొందిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ప్రతిపక్ష నేతగా పదేళ్లు, రాష్ట్రం విడిపోయాక ఇప్పటి వరకు రాష్ట్రాభివృద్దికి చంద్రబాబు ఏ విధంగా కృషి చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసునన్నారు.
 
దివంగత మహా నాయకుడు ఎన్టీఆర్‌ను, ముఖ్యమంత్రి చంద్రబాబును చులకన చేసేలా ఇష్టం వచ్చినట్లు సినిమా తీస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదని పేర్కొన్నారు. వర్మకు పిచ్చి పట్టిందని, తక్షణం ఆయనను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించి మానసిక వైద్యం చేయించాలన్నారు. యూట్యూబ్‌లో వర్మ విడుదల చేసిన పాటపై తక్షణం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. వర్మ పైశాచికం చివరిస్థితికి చేరిందన్నారు. తక్షణం ఆయా సన్నివేశాలను తొలగించకుంటే వర్మను రోడ్డు మీద తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు.