చామంతి.. నష్టం వంద కోట్లు

కార్తీకమాసం, అయ్యప్ప దీక్షలు, సంక్రాంతి ఇలా.. వరుస పండుగలతో పూలకు డిమాండ్ పెరగాల్సిన సమయంలో అమాంతం ధరలు పడిపోయాయి. కనీసం కోత కూలి అయినా గిట్టుబాటు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చామంతి పూలను కిలో రూ.10కు కూడా అడిగే వారు లేక పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. పంటను ట్రాక్టర్లతో దున్నేస్తూ ఇతర పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు మేకలు, గొర్రెలకు మేతగా వదిలేస్తున్నారు. కడప జిల్లాలో ఈ సీజన్లో చామంతి సాగు చేసిన రైతులకు వంద కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు. జిల్లాలో ఉద్యానపంటల కింద చామంతి, సంపంగి, కనకాంబరం, గులాబీ తదితరాలు 11 వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఇందులో చామంతి 7వేల ఎకరాల వరకు సాగవుతున్నట్లు ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. బెంగళూరు, కడియంల నుంచి ఏడు రకాల అంటునారు తీసుకువచ్చి నాటారు. ఎకరాకు రూ.60వేల వరకు ఖర్చు పెట్టారు. ఎకరాకు 5-7 టన్నుల దిగుబడి అంచనా. టన్ను రూ.50వేలు పలికితే, ఎకరాకు 3-3.50 లక్షల రూపాయల వరకు వస్తుంది. ఇందులో ఖర్చులు పోను సుమారు రూ.2 లక్షలు మిగిలే అవకాశం ఉంది. ఈ సారి నవంబరు మొదటి వారంలో చామంతి కిలో రూ.50 వరకు పలికింది. ఆ తర్వాత ధర పతనమవుతూ ప్రస్తుతం కిలో రూ.8కి పడిపోయింది. ఈ ధర కూలీలకు కూడా సరిపోదని రైతులు అంటున్నారు. జిల్లాలోని ఏడువేల ఎకరాల్లో సుమారు 40 వేల టన్నుల వరకు దిగుబడి ఉంటుందని ఉద్యానశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన రూ.వంద కోట్లకు పైగా నష్టం ఉంటుందని అంచనా.
