Published: 06-12-2018
వచ్చే బడ్జెట్లో 7 అంశాలకు ప్రాధాన్యం

వచ్చే బడ్జెట్(2019-20)లో ఏడు అంశాలకు ప్రాధాన్యమివ్వాలని ఆర్థిక మంతి యనమల రామకృష్ణుడు తన శాఖ అధికారులను ఆదేశించారు. సామాన్యులపై భారం పడకుండా ఆదాయ మార్గాలు పెంచాలని సూచించారు. బడ్జెట్ రూపకల్పన, ఆదాయార్జన శాఖల పనితీరు, వృద్ధి రేటుపై బుధవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి యనమల ప్రాధాన్య రంగాలపై సలహాలు, సూచనలు ఇచ్చారు. పేదరిక నిర్మూలన, రాష్ట్రాభివృద్ధి, ఆర్థిక అసమానతల తొలగింపు, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి, గ్రామీణాభివృద్ధి, మహిళాభ్యున్నతి..ఈ ఏడు అంశాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించాలన్నారు. పూర్తి బడ్జెట్, ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై ఈ సందర్భంగా చర్చించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆదాయ వ్యయాలను సమీక్షించారు. పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, నగదు నిర్వహణ, నగదు సర్దుబాట్లు, వడ్డీ చెల్లింపులు, పెట్టుబడి నిల్వలు, ఇరిగేషన్ బకాయిలు, వివిధ నియోజకవర్గాల్లో పరిపాలనా అనుమతులు, ఆర్థిక వృద్ధిరేటు పెరుగుదల, సీఎ్ఫఎంఎస్ మొదలైనవాటిపై చర్చించారు. నగదు నిర్వహణలో కొత్త పద్ధతులు, సమర్థ నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి వందల కోట్లు ఆదా చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు రవిచంద్ర, పీయూష్ కుమార్, కేవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.
ఆదాయ ఆర్జన లక్ష్యాల సాధనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత బ శాఖల అధికారులను యనమల ఆదేశించారు. రిజిస్ర్టేషన్ శాఖలో వినియోగదారులకు సౌకర్యంగా ఉండేవిధంగా చలానాల ద్వారా చెల్లింపు నిబంధనలు సులభతరం చేయాలని నిర్దేశించారు. రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ర్టేషన్, రవాణా, అటవీ శాఖల ఆదాయ వృద్ధి రేటు పెరుగుదలను సమీక్షించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, పెట్రోలియం ఉత్పత్తులు, రిజిస్ర్టేషన్లు, రవాణా శాఖల ఆదాయం ఆశాజనకంగా ఉండగా.. మైనింగ్, అటవీ శాఖల ఆదాయం వృద్ధిరేటు తక్కువగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్నట్లు అధికారులు తెలిపారు. గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఆదాయం ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. జీఎస్టీ, మైనింగ్ రాయల్టీ, వనరుల లభ్యత, కోర్టు కేసులు, పెట్రోలియం ఉత్పత్తులపై రాయల్టీ, పన్నులు, సీఎ్ఫఎంఎస్, ఎర్రచందనం, సామాజిక వనాలు తదితర అంశాలపైనా చర్చ జరిగింది. చేపల వేట కోసం సముద్రంలోపలికి వెళ్లే మత్స్యకారులకు పవర్ఫుల్ బోట్లు అందించేందుకు బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించాలని యనమల ఆదేశించారు.
