Published: 06-12-2018
ప్రవాసాంధ్రులకు కలిసొచ్చే ప్రయాణం

రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసిన తర్వాతే సింగపూర్-విజయవాడ విమానం కల సాకారమైంది. దీనిని వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) విధానంలో నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకు వచ్చింది. దీంతో మలేషియా, థాయ్లాండ్, సింగపూర్, ఇండొనేషియా పర్యాటకం సులువుగా మారింది. ఇక... అమెరికాతోపాటు యూర్పదేశాలకు వెళ్లే వారిలో 70 శాతానికి పైగా ప్రయాణికులు దుబాయ్ లేదా షార్జా మీదుగా వెళ్తున్నారు. దుబాయ్ దాకా వెళ్లాలంటే... హైదరాబాద్ లేదా చెన్నైకి వెళ్లి విమానం ఎక్కాల్సిందే. కొత్త సంవత్సరం నుంచి విజయవాడ-దుబాయ్ సర్వీసు ప్రారంభించేలా విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆరు నెలల కిందట దుబాయ్ - భారత్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు వచ్చిన స్లాట్స్ అన్నీ నిండిపోయాయి. దీంతో ఇన్నాళ్లు విజయవాడ నుంచి దుబాయ్/షార్జా సర్వీసు నడిపేందుకు వీలు కాలేదు. తాజాగా జెట్ ఎయిర్వేస్ సంస్థ దుబాయ్కి 10 సర్వీసులను ఉపసంహరించుకుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దుబాయ్ సర్వీసు ప్రవేశపెట్టే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అదే జరిగితే... కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం, చిత్తూరు జిల్లాలతోపాటు... తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల వారికి విజయవాడ అతి దగ్గరి ‘అంతర్జాతీయ విమానాశ్రయం’గా మారుతుంది. మరోచోటికి వెళ్లి విమానం ఎక్కాల్సిన బాధ తప్పుతుంది.
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లే వారిలో దాదాపు 40 శాతం మంది నవ్యాంధ్ర జిల్లాలకు చెందిన వారే అని అధికారిక సర్వేల్లో తేలింది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన సుమారు 5 లక్షల మంది వివిధ దేశాల్లో నివసిస్తున్నారు. అమెరికాలో రెండు లక్షల మంది, పశ్చిమాసియా దేశాల్లో 2 లక్షల మంది, ఇతర దేశాల్లో మరో లక్ష మంది దాకా నివసిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులతోపాటు ఇతరత్రా ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాల్లో వేలాది మంది స్థిరపడ్డారు. ఇక.. ప్రతి ఏటా 30 నుంచి 40 వేల మంది విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించడానికి విమానాలు ఎక్కుతున్నారు. విజయవా డ నుంచి సింగపూర్తోపాటు దుబాయ్ విమా నం అందుబాటులోకి వస్తే వీరందరికీ విదేశీ యానం సులువు అవుతుంది.
ఆధునికతతో హంగులు: ఇప్పటికే విజయవాడ విమానాశ్రయం దేశీయంగా అనూహ్య వృద్ధిని నమోదు చేస్తోంది. గత మూడేళ్లుగా 250 శాతం వృద్ధిని సాధిస్తోంది. విజయవాడ విమానాశ్రయంలో రూ.161 కోట్లతో ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్ను ఆధునీకరించారు. 611 కోట్ల వ్యయంతో శాశ్వత ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. రూ.100 కోట్ల వ్యయంతో రన్వేను విస్తరిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయంలో 16 పార్కింగ్ బేలు ఉన్నాయి. 500 కార్లు పార్క్ చేయవచ్చు. త్వరలోనే 25 పార్కింగ్ బేలు ఏర్పాటు చేయనున్నారు.
