సీబీఐలో కలకలానికి మూల కారణం...సతీశ్ సానా
Published: Tuesday November 20, 2018

అమరావతి : సతీశ్ సానా... ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు! తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఈ ‘హైదరాబాద్ వ్యాపారి’ చేసిన ఫిర్యాదే సీబీఐలో కలకలానికి మూల కారణం. ఈయన ఒక్కరే కాదు... సీబీఐ డీఐజీ మనీశ్ కుమార్ దాఖలు చేసిన సంచలన పిటిషన్లో మరెందరో తెలుగువారి పేర్లు కనిపించాయి. విశేషమేమిటంటే... మనీశ్ కుమార్ 2000 బ్యాచ్కు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి. ఆయన ఉమ్మడి ఏపీలో పలు జిల్లాల్లో పని చేశారు. ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లారు. సీబీఐలో ప్రక్షాళనకు కారణమైన కీలక సిఫారసులు చేసిన కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి కూడా తెలుగు వారే. అస్థానా చెప్పింది రాసుకుని... ఆయనపై వచ్చిన ఆరోపణలపై సీవీసీ మరింత విచారణ జరపలేదని మనీశ్ ఆరోపించారు. హైదరాబాద్కు చెందిన ‘ఢిల్లీ పబ్లిక్ స్కూల్’ యజమాని గోరంట్ల రమేశ్తో కలిసి తాను సీవీసీ చౌదరితో భేటీ అయినట్లు సతీశ్ వెల్లడించారు.
ఇక... ప్రస్తుతం నవ్యాంధ్రలో ఉన్న ఐఏఎస్ అధికారి రేఖారాణి ద్వారా సతీశ్ సానాతో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి మాట్లాడినట్లు మనీశ్ వెల్లడించారు. రేఖారాణి ప్రస్తుతం సాగునీటి శాఖలో సహాయ, పునరావాస ప్రత్యేక కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రి హరిభాయ్ చౌదరికి ముడుపుల గురించి వివరిస్తూ... మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. ఇక లండన్ హోటల్లో తాను చాముండేశ్వరనాథ్తో మాట్లాడినట్లు కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సురేశ్ చంద్ర... సానా సతీశ్తో చెప్పారని వెల్లడించారు. కొసమెరుపు ఏమిటంటే... అలోక్వర్మను సెలవుపై పంపిన అనంతరం సీబీఐ ఇన్చార్జి డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఎం.నాగేశ్వరరావు కూడా తెలుగు వారే!
