పోలవరం ప్రధాన పనులపై సీఎం ఆదేశం
Published: Tuesday November 06, 2018

ప్రపంచ రికార్డులన్నీ తిరగరాసేలా అత్యంత వేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు జరగాలని నిర్మాణ సంస్థలను, అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. డిసెంబరు 17న ప్రతిష్ఠాత్మక రేడియల్ గేట్ల బిగింపు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్దేశించారు. సోమవారం ఉండవల్లి ముఖ్యమంత్రి ప్రజా దర్బారు వేదికలో ప్రాజెక్టుపై వర్చువల్ సమీక్ష జరిగింది. పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనుల్లో వేగాన్ని పెంచాలని.. త్రీగార్జె్సను అధిగమించి ప్రపంచ రికార్డులన్నింటినీ తిరగరాయాలని నిర్మాణ సంస్థ నవయుగను సీఎం ఆదేశించారు. ఈ రికార్డును తిరగరాసే దిశగా గతంలోనే యంత్రసామగ్రిని సిద్ధం చేసుకున్నామని.. 11.65 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు చేరువయ్యామని.. మరో గంటలో త్రీగార్జె్సను రికార్డును బద్దలు కొడతామనుకున్న తరుణంలో భారీ వర్షం కారణంగా పనులు ఆపేయాల్సి వచ్చిందని సంస్థ ఎండీ సీహెచ్ శ్రీధర్ వెల్లడించారు.
వచ్చే ఏడాది పోలవరం నుంచి గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా అందించాలని నిర్ణయించినందున ప్రధాన పనులన్నీ లక్ష్యాల కంటే ముందస్తుగా చేపట్టాలని నిర్మాణ సంస్థలను, జల వనరుల శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతివారం ఎంతెంత పనులు చేస్తున్నామో లెక్కిస్తూ.. బ్యాక్లాగ్ లేకుండా చూసుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖరుకల్లా ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులు పూర్తికావలసిందేనని స్పష్టం చేశారు. స్పిల్ చానల్, అప్రోచ్ చానల్ సహా ప్రధాన పనులన్నీ పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. చెప్పడం కాదని, ప్రపంచ రికార్డులన్నీ తిరగరాసేలా పనులు పూర్తి చేయాలని మరోసారి సీఎం అన్నారు.
