2 వేల కోసం నిండు ప్రాణం తీసిన కర్కోటకులు
Published: Sunday September 30, 2018

తమిళనాడు కాంచీపురానికి చెందిన కరడుగట్టిన నేరగాళ్ల చేతిలో కడప జిల్లా పెనగలూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. పొడిచి, గొంతుకోసి హత్య చేసిన నిందితులు అతని వద్ద లభించిన కేవలం రూ. 2200 దోచుకుని పరారయ్యారు. ఎట్టకేలకు పోలీసులు వారిని కాంచీపురంలో పట్టుకుని అరెస్టు చేశారు. వివరాలిలా..
కడప జిల్లా పెనగలూరు మండలం చక్రంపేటకు చెందిన చిన్న ఓబుల్రెడ్డిని ఆయన కుమారులు తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స కోసం కుమారులు మాధవరెడ్డి (37), నవీన్రెడ్డి వచ్చి ఈనెల 18న అడ్మిట్ చేశారు. అదేరోజు రాత్రి 7-30 సమయంలో హోటల్ నుంచి భోజనం తెచ్చి సోదరుడు, ఇతర కుటుంబసభ్యులకు ఇచ్చాడు. తాను బయటకు వెళ్లి తిని వస్తానని పోయాడు. మాధవరెడ్డి ఒక రోజు గడిచినా తిరిగి రాకపోవ డంతో 19న కుటుంబ సభ్యులు తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేసిన పోలీ సులకు శ్రీనివాసం పక్కనున్న భారతీ బస్టాండ్ సమీపంలోని పొదల్లో మాధవరెడ్డి మృతదేహం 21న లభ్యమైంది. దీనిపై దర్యాప్తు సాగించిన పోలీసులకు ఇది తమిళనాడుకు చెందిన కరడుగట్టిన నేరగాళ్ల పనిగా స్పష్టమైంది.
ఈ దారుణానికి పాల్పడ్డ తమిళనాడుకు చెందిన కరడుగట్టిన ముగ్గురు నేరస్తులను తిరుపతి ఈస్ట్ పోలీసులు అరె్స్ట చేసి శుక్రవారం మీడియాకు చూపించారు. తిరుపతి అర్బన్ ఈస్ట్ డీఎస్పీ మునిరామయ్య వెల్లడించిన వివరాల మేరకు... ఈనెల 18న రాత్రి భోజనం చేయడానికి మాధవరెడ్డి స్థానిక భారతీ బస్టాండ్ వద్దకు వచ్చాడు. మూత్ర విసర్జనకుగాను శ్రీనివాసం అతిథిగృహానికి ఆనుకుని ఉన్న ఖాళీ ప్రదేశంలోకి వెళ్లాడు. తమిళనాడు కాంచీపురానికి చెందిన నేరస్తులు ధరణీధరన్ (20), రాజ్కుమార్ (24), శక్తి (20) మాధవరెడ్డిని అనుసరించి వెళ్లారు. ఒంటరిగా ఉన్న అతనిని కత్తితో పొడిచి డబ్బు గుంజుకునేందుకు నిందితులు ప్రయత్నించారు. ఈ క్రమంలో మాధవరెడ్డి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో రెచ్చిపోయిన నిందితులు కత్తులతో ఆయనను ఇష్టంవచ్చినట్టు పొడిచి, గొంతుకోసి చంపేశారు. మాధవరెడ్డి వద్ద ఉన్న రూ.2,200 దోచుకుని పరారయ్యారు.
ఈస్ట్ పోలీసులతోపాటు పోలీసు టెక్నికల్ టీమ్ (టీఐటీ), కమాండ్ కంట్రోల్ సిబ్బంది నిందితుల ఆచూకీ కనుగొని కాంచీపురంలో వలపన్ని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ మునిరామయ్య వెల్లడించారు. నిందితులపై తమిళనాడులో దొంగతనాలు, దోపిడీలు, హత్య కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. మొదట వీరు తిరుమలలో ఏదైనా దోపిడీ చేయాలని వెళ్లారని, అక్కడ కుదరక కిందికి వచ్చిన సమయంలో మాధవరెడ్డి వీరికంటబడి బలైపోయాడని డీఎస్పీ వివరించారు. నిందితులను రిమాండ్కు పంపించారు. కేసును 9 రోజుల్లోనే ఛేదించిన ఈస్ట్ సీఐ శివప్రసాద్, ఎస్ఐలు షేక్ షావలి, సిబ్బంది రవిరెడ్డి, గోపీకృష్ణ, రమేష్, వెంకటేష్, జ్యోతిబాబు తదితరలును డీఎస్పీ అభినందించారు.
