డేటింగ్ సైట్ల పేరిట ఆకర్షణ వల
Published: Wednesday September 26, 2018

మూడు వెబ్సైట్లు.. నాలుగు ఫోన్లు.. ఆరు కబుర్లు! అమ్మాయిలతో డేటింగ్ చేయాలనే అబ్బాయిల బలహీనతే పెట్టుబడి! కేవలం రెండేళ్లలోనే ఏకంగా రూ.150 కోట్లు కొల్లగొట్టారు! అమ్మాయిల పిచ్చిలో ఉన్న యువత ఒక్కొక్కరు పది నుంచి 20 లక్షల వరకూ సమర్పించుకున్నారు. మోసపోయామని తెలుసుకుని కొందరు పోలీసులను ఆశ్రయించారు. దాంతో, రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు.. డేటింగ్ వెబ్సైట్ల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న పశ్చిమ బెంగాల్ ముఠా ఆట కట్టించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ మంగళవారం కమిషనరేట్లో ఈ వివరాలు వెల్లడించారు.
3 వెబ్సైట్లు.. 20 కాల్ సెంటర్లు
పశ్చిమ బెంగాల్లోని హౌరాకు చెందిన దేబాశిష్ ముఖర్జీ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని భావించాడు. అనుకున్నదే తడవుగా తన స్నేహితులు, కోల్కతాకు చెందిన ఫెయిజుల్ హక్, సందీప్ మిత్రా, హౌరాకు చెందిన అనితా డే, సిలిగురికి చెందిన నీతా శంకర్తో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు. రెండేళ్ల కిందట అమ్మాయిలను సరఫరా చేస్తామంటూ వరల్డ్డేటింగ్.కామ్, గెట్యూత్లేడీ.కామ్, మైలవ్18.ఇన్ వెబ్సైట్లను ప్రారంభించాడు. వాటిలో అందమైన, ఆకర్షణీయమైన అమ్మాయిలు, సెక్సీ ఫొటోలను అప్లోడ్ చేశాడు. ఇవన్నీ వేర్వేరు గూగుల్ సైట్లలోంచి తీసినవే. వాటితోపాటు తాము అందించే సర్వీస్ వివరాలను పేర్కొన్నాడు. వెబ్సైట్లోనే ఒక ఫామ్ ఉంటుంది. కస్టమర్లు తమ వివరాలను అందులో పొందుపరచాలి. అందులోనే ఎటువంటి అమ్మాయి కావాలో ఎంపిక చేసుకోవాలి.
కాల్ సెంటర్లతో కహానీ ఇదీ
వెబ్సైట్లో వివరాలు నమోదు కాగానే వారికి ఓ ఫోన్ వస్తుంది. అవతలి నుంచి ఓ అమ్మాయి ఆకర్షించే మాటలతో కవ్విస్తుంది. తియ్యటి మాటలతో మాయ చేస్తుంది. కవ్వింపు మాటలతో కస్టమర్లను బుట్టలో వేసుకొని డబ్బులు గుంజే కార్యక్రమం మొదలుపెడతారు. తొలుత రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1080తో మొదలుపెడతారు. తమ వద్ద సిల్వర్, గోల్డ్, ప్లాటినం సర్వీసులు ఉన్నాయంటారు. అప్పటికే అమ్మాయిల కోసం ఉవ్విళ్లూరుతున్న యువత వాళ్లకు నచ్చిన సర్వీసును ఎంచుకుంటారు. ఇక అక్కడి నుంచి వివిధ సర్వీసుల పేరిట విడతలవారీగా అందినకాడికి దోచుకుంటారు. హై ప్రొఫైల్ కస్టమర్లతో ప్రధాన నిందితురాలు అనితా డేనే మాట్లాడుతుంది. సంపన్న వర్గాల కస్టమర్లతో అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతుంది.
అప్పటి వరకు వాళ్లు చెప్పినట్లు డబ్బులు చెల్లించిన కస్టమర్లు.. తమ వద్దకు వచ్చే అమ్మాయిని ఊహించుకుంటూ ఊహల్లో విహరిస్తారు. ఎంతకీ అమ్మాయి రాకపోవడంతో అంతకుముందు తనతో మాట్లాడిన అమ్మాయికి ఫోన్ చేస్తారు. అది కాస్తా స్విచ్ఛాఫ్ చేసి ఉంటుంది. చివరకు ఎలాంటి ఎస్కార్టు సర్వీసు ఇవ్వకుండానే బిచాణా ఎత్తేస్తారు. ఇలా యువకులను కవ్వించి, మాటలతో బురిడీ కొట్టించడానికి డార్జిలింగ్ జిల్లా సిలిగురిలో 12, కోల్కతాలో 8 మొత్తంగా 20 కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వాటిలో 400 మందిని నియమించారు. కోల్కతాలో ఓ ఎరువుల దుకాణం పేరిట లైసెన్స్ తీసుకున్నారు. దాని మాటున కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ అక్రమాన్ని పోలీసులు బట్టబయలు చేశారు.
ఇలాంటి సైట్ల వలలో పడొద్దు: సజ్జనార్
యువత ఇలాంటి వెబ్సైట్ల వలలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. వాళ్లు చెప్పే కల్లబొల్లి మాటలకు, సైట్లలో పెట్టిన అమ్మాయిల ఫొటోలను చూసి ఆకర్షణకు లోనుకావద్దు. ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయి. వాళ్లంతా ఈ అమ్మాయిల మాయలో పడి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. చాలామంది పరువు పోతుందని, ఇంట్లో తెలుస్తుందని భయపడి ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. ఇలాంటి వెబ్సైట్ల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలి. అనుమానం వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి.
రోజుకు 20 లక్షల ఆదాయం
ఈ కాల్ సెంటర్లు ఒక్కో దాని నుంచి రోజుకు సుమారు లక్ష ఆదాయం వస్తోందని, మొత్తంగా నిందితుల ఆదాయం రోజుకు రూ.20 లక్షలని పోలీసులు గుర్తించారు. ఎనిమిది బ్యాంకు ఖాతాల ద్వారా వీరు తమ లావాదేవీలు నడుపుతున్నారు. ఈ రెండేళ్లలో సుమారు రూ.150 కోట్లను వీళ్లు కొల్లగొట్టారని పోలీసులు అంచనా వేస్తున్నారు.
