సింహాచలంలో మూడు రోజుల పాటు గురుపూజొత్సవాలు
Published: Thursday January 11, 2018

శాంతి మార్గం, యోగ జీవనం, పరమ గురువుల బోధనలను అందరకి తెలియజేసేందుకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక సేవా సంస్థ జగద్గురు పీఠం ఆధ్వర్యంలో గురుపూజోత్సవాలు సింహాచలంలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ గురుపూజోత్సవాలు గురువారం నుంచి శనివారం వరకు నిర్వహించనున్నారు.
1978 నుంచి సింహాచలంలోనే. 1962లో జగద్గురు పీఠం వ్యవస్థాపకుడు కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులు (మాస్టర్ ఇ.కె.) గుంటూరులో తొలిసారిగా గురుపూజోత్సవాలకు శ్రీకారం చుట్టారు. 1978 నుంచి సంస్థ భౌగోళిక అధ్యక్షుడు కంభంపాటి పార్వతీకుమార్ సారథ్యంలో సింహాచలంలోనే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా దేవస్థానానికి చెందిన నృసింహసదన్, తితిదే అతిథి గృహాల ఆవరణలో ఈ కార్యక్రమం జరగనున్నది . పవిత్ర గ్రంథాల్లోని జ్ఞాన సమన్వయం, యోగ జీవనసరళి, అంతర్యామి సాధన, పతంజలి యోగ సూత్రాలను బోధిస్తామని జగద్గురు పీఠం డైరెక్టర్ చింతలపాటి సత్యదేవ్ తెలియజెసారు.
గ్రంథావిష్కరణలు: ముఖ్యంగా ఈ కార్యక్రమంలొ భాగంగా మాస్టర్ ఇ.కె. రచించిన ఓవర్సీస్ మెసేజెస్ 5వ సంపుటం, గోదా వైభవం కావ్యాలు, యోగా ఆఫ్ పతంజలి, జ్ఞాన తరంగాలు పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. పార్వతీకుమార్ రచించిన కుమార సంభవం, మార్కండేయుడు, భీష్ముడు, దస్ మాస్టర్ సీవీవీ స్పీక్స్ అనే పుస్తకాలు అవిష్కరించటం జరుగుతుంది
ప్రముఖుల ప్రసంగాలు
మూడు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మాస్టర్ పార్వతీకుమార్ ప్రధాన ప్రవచనాలు ఉంటాయి. ప్రాక్పశ్చిమ సమన్వయ సభలో భాగంగా లుడ్జర్ (స్విట్జర్లాండ్), జోసఫ్ పరడేల్ (స్పెయిన్), డోరిస్ డోర్లె (జర్మనీ) తమ అనుభవాలను వివరిస్తారు. జగద్గురు పీఠం ఛైర్మన్ కె.ఎస్.శాస్త్రికి సహస్ర చంద్రదర్శన ఉత్సవం నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి సుమారు 4వేల మంది సాధకులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. బెల్జియం, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, డెన్మార్క్, దక్షిణ అమెరికా దేశాల నుంచి 63 మంది విదేశీయులు పాల్గొంటున్నట్లు సత్యదేవ్ పేర్కొన్నారు.
