కేరళ ప్రభుత్వానికి అధికారుల నివేదిక
Published: Wednesday August 22, 2018

కేరళలో వరద తగ్గుముఖం పట్టింది. కానీ... ఈ బాధ మాత్రం ఇప్పట్లో తీరేదికాదని అధికారులు చెబుతున్నారు. కనీసం 15 రోజులపాటు సహాయ శిబిరాలు నిర్వహించక తప్పదని స్పష్టం చేశారు. కారణం... వరద బాధితుల ‘ఇంటి పరిస్థితే’. వేలాది ఇళ్లు వరద దెబ్బకు కొట్టుకుపోయాయి. గట్టిగా నిలబడిన ఇళ్లలోకి పూర్తిగా బురద వచ్చి చేరింది. గత రెండు రోజులుగా ఆరు జిల్లాల్లో వరదలు బాగా తగ్గుముఖం పట్టాయి. మోకాళ్ల లోతు నీళ్లు ఉన్నప్పటికీ... ఇళ్లమీద బెంగతో ప్రజలు శిబిరాల నుంచి స్వగ్రామాలకు వెళ్తున్నారు.
వరద తగ్గిన ప్రాంతాల్లోని ఇళ్లలో మట్టితప్ప మరేం కనిపించడం లేదు. నిత్యావసరాలు, ఇతర సామాగ్రి, ధాన్యం, వంట సామాను అన్నీ వరదార్పణమే. దీంతో ప్రజలు ఇళ్లలో ఉండలేక మళ్లీ శిబిరాలకు చేరుతున్నారు. నీరు పూర్తిగా తొలగిన తర్వాత... మేట వేసిన ఇసుక, మట్టి, బురదను తొలగించేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాలి. దీనికోసం మరో వారం రోజుల సమయం పడుతుందని అంచనావేస్తున్నారు. ఈ నేపధ్యంలో కనీసం మరో 15-20 రోజుల పాటు ప్రజలు కష్టపడాల్సి ఉంటుందని తేల్చారు.
అప్పటిదాకా మూడువేలపై చిలుకు సహాయ, పునరావాస శిబిరాలను కొనసాగించాల్సి ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికీ శిబిరాల్లో 8.75 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు. దాదాపు 2.85 లక్షల ఇళ్లు ఇంకా నీటిలోనే ఉండిపోయాయని కేరళ పబ్లిక్వర్క్స్ విభాగం ముఖ్యకార్యదర్శి, తెలుగు ఐఏఎస్ అధికారి కమలవర్ధన్రావు నివేదిక ఇచ్చారు. గత ఆరు రోజులుగా శిబిరాల నిర్వహణ బాధ్యతలు ఆయనే పర్యవేక్షిస్తున్నారు. వరదలు తగ్గినా కనీసం గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు నివసించే పరిస్థితి తీసుకొచ్చేవరకు కష్టతరంగానే ఉంటుందని నివేదించారు.
శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి ఆహారం అందించగలుగుతున్నప్పటికీ... దుస్తులు, దుప్పట్లు సమకూర్చడం కష్టంగా ఉందని అధికారులు వివరించారు. వరద బాధిత ప్రాంతాలకు ఆహారం, తాగునీటిని కూడా పూర్తిగా ఆకాశమార్గంలో తెప్పిస్తున్నారు. ఇప్పటిదాకా 10 లక్షల ఆహార ప్యాకెట్లు, 23 లక్షల తాగునీటి బాటిళ్లను హెలికాప్టర్ల ద్వారా తరలించారు. అచ్చంగా దీనికోసమే 23కుపైగా హెలికాప్టర్లను వాడుతున్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మరో 15 హెలికాప్టర్లను మోహరించారు. వరద తగ్గుముఖం పట్టడంతో రహదారులు, వంతెనలు, రైల్వే లైన్లను యుద్ధప్రాతిపదికన పునరుద్దరించాలని మంగళవారం నాటి సమావేశంలో నిర్ణయించారు.
ఏపీ నుంచి తరలిన యువత
కేరళకు ఆంధ్రప్రదేశ్ నుంచి అందుతున్న సహాయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఏపీ నుంచి అనేకమంది నిపుణులు, యువకులు స్వచ్ఛందంగా కేరళకు వెళ్లి సహాయం అందిస్తున్నారని ఐఏఎస్ అధికారి కమలవర్ధనరావు తెలిపారు.
ఇలా చేయూతనివ్వండి..
‘చాలా రాష్ట్రాలు బియ్యం పంపిస్తున్నాయి. కానీ ఇప్పుడు కావాల్సిందల్లా ప్రజలకు దుస్తులు, చలి నుంచి కాపాడే దుప్పట్లు, వంట సామాగ్రి. శిబిరాల నుంచి ఇంటికెళ్లాక బాధితులు ప్రతి వస్తువు కొనుక్కోవాలంటే ఇబ్బందే’ అని సహాయక చరల్లో పాల్గొంటున్న ఏపీ అధికారి ఒకరు చెప్పారు.
