రాష్ట్రానికి 10 ఐటీ కంపెనీలు
Published: Tuesday July 31, 2018

రాష్ట్ర విభజన అనంతరం ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ... చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకు దేన్నీ వదలడం లేదు. నేరుగా ఐటీ విభాగం, అదే సమయంలో ఏపీఎన్ఆర్టీ, మరోవైపు ఎపిటా ఆధ్వర్యంలో ఐటీ, ఎలక్ర్టానిక్స్ కంపెనీలు రాష్ర్టానికి వచ్చేలా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 61 ఐటీ కంపెనీలను తీసుకొచ్చిన ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో తాజాగా బుధవారం ఒక్కరోజే 10 కంపెనీలు రాష్ర్టానికి రానున్నాయి. ఈ కంపెనీల ద్వారా 936 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఇప్పటికే 285 మందిని ఈ కంపెనీలు తీసుకున్నాయి. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం ఈ కంపెనీలను ప్రారంభిస్తారు. మంగళగిరి ఎన్ఆర్టీ టెక్పార్కులో ఆరు కంపెనీలు, విజయవాడలో రెండు కంపెనీలు, గన్నవరంలోని మేథా టవర్స్లో రెండు కంపెనీలు ప్రారంభం కానున్నాయి.
ఈ 10 కంపెనీలను ఏపీఎన్ఆర్టీ భవన్ నుంచి లోకేశ్ ప్రారంభిస్తారు. ఈ కంపెనీల్లో అక్రుక్స్ ఐటీ డాటా సర్వీసెస్ 300 మందికి, నార్మ్ సాఫ్ట్వేర్ 150 మందికి, యలమంచిలి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ద్వారా 200 మందికి, కేడ్ప్లయ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 90 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. ఇవి కాక విభర్టెక్ సొల్యూషన్స్, సీఎ్సఎస్ టెక్ సొల్యూషన్స్, హెడ్రమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెంటిస్ ఐటీ సొల్యూషన్స్, ఫ్రీమాంట్ ఐటీ సొల్యూషన్స్, ప్రొకొమ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీలు రానున్నాయి. ఐటీ సొల్యూషన్స్, బీపీవో, మొబైల్ అప్లికేషన్ డెవల్పమెంట్, ఆన్లైన్ మార్కెటింగ్ తదితర రంగాల్లో ఈ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తాయని ఏపీఎన్ఆర్టీ సీఈవో రవికుమార్ వేమూరి తెలిపారు.
స్పేస్కు డిమాండ్... క్యూలో 12 కంపెనీలు
రాష్ట్రంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు నిర్మాణ స్థలం కేటాయించాలని పలు కంపెనీలు దరఖాస్తు చేశాయి. మొత్తం 12 కంపెనీలు తమకు స్పేస్ ఇస్తే కంపెనీలు ఏర్పాటు చేస్తామంటూ ముందుకొచ్చాయి. ఇప్పటివరకు అమరావతిలో ఇండ్వెల్ టవర్స్, మేధాటవర్స్, కె బిజినెస్ స్పేసెస్, ఎన్ఆర్టీ టెక్ పార్కు, పైకేర్ భవనాల్లో కంపెనీలకు స్పేస్ కేటాయిస్తూ వచ్చారు. అయితే ఇవన్నీ దాదాపుగా నిండిపోయాయి. అలాగే విశాఖపట్నంలో ఉడా భవనం, టెక్ మహీంద్రా, క్వాంటమ్ హబ్ భవనాల్లో ఐటీ కంపెనీలకు స్థలం కేటాయిస్తున్నారు. ఇప్పుడు క్యూలో ఉన్న 12 కంపెనీలకు కార్యాలయ స్పేస్ కోసం అన్వేషిస్తున్నారు. ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు కార్యాలయాల స్పేస్ను ప్రభుత్వమే సమకూరుస్తోంది. ప్లగ్ అండ్ ప్లే తరహాలో అన్ని ఏర్పాట్లున్న స్పేస్ను కేటాయిస్తోంది. మరోవైపు ప్రైవేటు బిల్డర్లతో కూడా మాట్లాడి కొంత నిర్మాణ స్థలాన్ని ఐటీ కంపెనీల కోసం తీసుకుంటోంది.
ఈ విధంగా కొన్ని లక్షల చదరపు అడుగుల కోసం ఇప్పటికే ఒప్పందాలు చేసుకుంది. ఏటా 10 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఏడాది ఇప్పటివరకు 61 కంపెనీలను రాష్ర్టానికి తీసుకొచ్చి సుమారు 4 వేలమందికి ఉద్యోగాలు కల్పించామని, మరో మూడువేల ఉద్యోగాలు ఇదే కంపెనీల్లో రానున్నాయని ఏపీఎన్ఆర్టీ ఎండీ సాంబశివరావు తెలిపారు. మరిన్ని కంపెనీల ఏర్పాటు కోసం ఐటీ శాఖ మంత్రి లోకేశ్ నేతృత్వంలో ప్రయత్నాలు చేస్తున్నామని.. వాటిని కూడా తీసుకొచ్చి 10 వేల ఉద్యోగాల లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు.
