సవాల్ విసురుతున్న దొంగలు ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకం
Published: Saturday July 14, 2018

గుంతకల్లు/తాడిపత్రి/అనంతపురం : జనం తక్కువగా ఉండే రైల్వే స్టేషన్లను టార్గెట్ చేసుకుని ప్రయాణికులపై అంతర్రాష్ట్ర రైలు దోపిడీ ముఠాలు విరుచుకుపడుతున్నాయి. వేసవి ముగిసిన తరువాత వీరి ఆగడాలు మరీ ఎక్కువైపోయాయి. వేసవిలో రైళ్లలో గస్తీ ఎక్కువగా ఉంటుందనే కారణంతో మార్చి నుంచి మే వరకు సంయమనం పాటించిన రైలు దొంగలు పోలీసులను ఏమార్చి జూన్ నుంచి పెట్రేగిపోతున్నారు. ముఖ్యంగా పెద్ద రైల్వే స్టేషన్లకు దూరంగా ఉండే చిన్న రైల్వే స్టేషన్లు టార్గెట్గా చేసుకుని హల్చల్ చేస్తున్నారు. రైళ్లపై దాడిచేసినప్పుడు కూడా ఆర్మ్డ్ పోలీసులు ఫైర్ చేయకపోవడంతో వీరు మరీ రెచ్చిపోతున్నారు.
అనంతపురం సమీపంలోని ప్రసన్నాయపల్లి, తాడిచెర్ల, గార్లదిన్నె, పామిడి, గుత్తి సమీపంలోని జక్కలచెరువు, తాడిపత్రి సమీపంలోని జూటూరు స్టేషన్లు రైలు దోపిడీలకు ఈ సంవత్సరం వేదికగా నిలిచాయి. తాజాగా ఇప్పుడు తాడిపత్రి సమీపంలో ఉన్న వంగనూరు స్టేషన్ టార్గెట్ అయింది. కేవలం నెల రోజుల వ్యవధిలో తాడిపత్రి వద్ద రెండు దోపిడీలు, గుత్తి సమీపంలో ఒకటి, పామిడి-ధర్మవరం సెక్షన్లో నాలుగు దోపిడీ సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి 28న అనంతపురం సమీపంలో గల చిన్న రైల్వేస్టేషన్ తాడిచెర్లలో బీదర్-యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్లో దుండగులు రాళ్లువిసిరి దోపిడీకి పాల్పడ్డారు. అంతకుముందు అనంతపురం-ధర్మవరం సెక్షన్లో యశ్వంతపూర్-కోర్బా ఎక్స్ప్రె్సలో హిజ్రాలు దొంగతనాలకు పాల్పడ్డారు.
జూన్ 22న జూటూరు, జక్కలచెరువు స్టేషన్ల వద్ద వెంకటాద్రి, రాయలసీమ ఎక్స్ప్రె్సలలో దోపిడీలు జరిగాయి. ఈ నెల 10న పామిడి స్టేషన్ వద్ద ప్రయాణికులను దోచుకున్నారు. ఇప్పుడు వంగనూరు స్టేషన్ వద్ద చెన్నై నుంచి కాచిగూడ వెళ్లే 17651 నెంబరు గల ఎగ్మోర్ ఎక్స్ప్రె్సలో దోపిడీ జరిగింది. సిగ్నలింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం ద్వారా ప్రొఫెషనల్ డెకాయిట్లు రైళ్లపై తెగబడుతున్నారు. ప్రతి సంవత్సరం కొత్త పథకంతో రైలు ప్రయాణికులను దోచుకుంటున్నారు. అయినా వారిని నిలువరించడంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ దళాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. ముఖ్యంగా రైల్వే ఆస్తులు పరిరక్షించాల్సిన ఆర్పీఎఫ్ శాఖ సిగ్నల్ వ్యవస్థను కాపాడలేకపోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఈ దఫా గస్తీ పోలీసులు ఉండడంతో పాటు సకాలంలో మేల్కొని గాలిలోకి కాల్పులు జరపడంతో అందినకాడికి దోచుకొని దొంగలు పరారయ్యారు. ఈ మాత్రం కూడా గతంలో చేయకపోవడం వల్లే దొంగల కు అడ్డూ అదుపూ లేకుండాపోయిందనే విమర్శలున్నాయి. జీఆర్పీ పోలీసులకు మాదిరిగా ఫైర్ ఓపెన్ చేయడంలో ఆర్పీఎఫ్ పోలీసులు ముందుకు రావడంలేదనే ఆరోపణలున్నాయి. గుత్తి రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కోచ్లో టిక్కెట్టు లేకుండా ఎక్కిన ఓ ప్రయాణికుడిని కొట్టిన సంఘటనలో జీఆర్పీ కానిస్టేబుల్ ఒకరు గతంలో సస్పెండయ్యారు. దీం తో ఏంచేస్తే ఏం కొంప మునుగుతుందోననే భయం ఆర్పీఎఫ్ పోలీసుల్లో నెలకొంది. జీఆర్పీలో మాదిరిగా సిబ్బంద్దికి శాఖాధికారులు అండగా ఉండడంలేదనే భావన వ్యక్తమవుతోంది.
